మసూద్కు షాక్: 5వేల ఉగ్రవాదుల బ్యాంక్ ఖాతాలు సీజ్!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో విచ్చలవిడిగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర సంస్థలకు బ్రేక్ వేస్తూ వారి ఆటకట్టిస్తున్నారు. పాక్ లో ఇప్పటి వరకు 5,100 మంది ఉగ్రవాదుల బ్యాంకు అకౌంట్స్ గుర్తించామని పాకిస్థాన్ అధికారులు అంటున్నారు.
ఆ బ్యాంకు అకౌంట్స్ లో దాదాపు రూ. 40 కోట్లకు పైగా నగదు డిపాజిట్ చేశారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారులు గుర్తించారు. భారత్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేయించిన మాస్టర్ మైండ్, జైష్-ఇ-మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ బ్యాంకు అకౌంట్ అందులో ఉందని అధికారులు చెప్పారు.
ప్రస్తుతం మౌలానా మసూద్ అజహర్ ప్రొటెస్టీవ్ కస్టడీలో ఉన్నాడు. పాక్ సచివాలయం అధికారుల ఒత్తిడి మేరకు అనుమానిత ఉగ్రవాదుల బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేస్తున్నామని, అందులో మౌలానా మసూద్ అజహర్ బ్యాంకు అకౌంట్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ సచివాలయం అధికారులు మూడు (ఏ,బీ,సీ) నివేదికల్లో అనుమానిత ఉగ్రవాదుల పేర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ కు పంపించింది. అందులో 'ఏ' నివేదికలో 1,200 మంది అనుమానిత ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
సెక్షన్ 1997 చట్టం ప్రకారం అనుమానిత ఉగ్రవాదుల బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేశామని పాక్ బ్యాంకు అధికారులు తెలిపారని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ ఓ కథనం ప్రచురించింది. అయితే పాక్ అక్కడి ఉగ్రవాదుల విషయంలో నాటకాలు ఆడుతుందా ? అని భారత అధికారులు గమనిస్తున్నారు.