ఉర్దూ స్కూల్లో భారీ పేలుడు: ఖురాన్ సెమినార్ నడుస్తుండగా: ఉగ్రవాద చర్యగా: బ్యాగ్లో ఐఈడీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పెషావర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుమంది మరణించారు. 75 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డ వారిలో చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ వారిని యుద్ధ ప్రాతిపదికన వేర్వేరు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర చికిత్సను అందిస్దున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
పెషావర్లోని దిర్ కాలనీలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దిర్ కాలనీలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఖురాన్ సెమినార్లో ఈ పేలుడు సంభవించింది. పాఠశాల తరఫున పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు ఈ ఖురాన్ సెమినార్కు హాజరయ్యారు. సెమినార్ కొనసాగుతోన్న సమయంలో పెద్ద శబ్దం చేస్తూ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుమంది అక్కడికక్కడే మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. వారిని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.
వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి ప్రతినిధి మహ్మద్ ఆసిమ్ తెలిపారు. గాయపడ్డ వారిలో చిన్నపిల్లలు ఉన్నారని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు సంభవించిన ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్లో రంగంలోకి దింపారు. పేలుడు సంభవించడానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు. పేలుడుకు గల కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని పెషావర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) మన్సూర్ అమన్ తెలిపారు.
Recommended Video
బాంబుల వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చనడానికి ఇంకా ఆధారాలు లభించలేదని అన్నారు. ఉగ్రవాద చర్య కోణంలోనూ దర్యాప్తు సాగిస్తామని పేర్కొన్నారు. ఖురాన్ క్లాస్ జరుగుతోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగ్తో ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని సీనియర్ పోలీస్ అధికారి వకార్ అజీమ్ తెలిపారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు.