మోడీ-బైడెన్ చర్చల్లో కీలకంగా పాకిస్తాన్-తాలిబన్లకు మద్దతుపై భారత్ ఫిర్యాదు-ఇరుకునపెట్టే వ్యూహం
ఆప్ఘనిస్తాన్ లో వేగంగా మారుతున్న పరిణామాలు ఇవాళ భారత ప్రధాని నరేంద్రమోడీ- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చల్లోనూ కీలకంగా ప్రస్తావనకు రాబోతున్నాయి. ఇవాళ బైడెన్ తో జరిగే భేటీలో తాలిబన్ల సర్కార్ కు పాకిస్తాన్ అందిస్తున్న సాయంపై ప్రధాని మోడీ ఫిర్యాదు చేయబోతున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు అడ్డగా మారబోతున్న ఆప్ఘనిస్తాన్ గడ్డపై తాలిబన్లకు పాకిస్తాన్ మద్తతుతో అంతర్జాతీయంగా ఏ సంకేతాలు వెళ్తున్నాయన్న దానిపై ఇవాళ మోడీ-బైడెన్ చర్చ సాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మోడీ-బైడెన్ భేటీ
ఇవాళ భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో తొలిసారి ద్వైపాక్షిక భేటీ కాబోతున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మోడీ తొలిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. గతంలో ట్రంప్ హయాంలో పలుమార్లు అమెరికా వెళ్లి ఆయనకు మద్దతుగా ప్రచారాల్లో సైతం పాల్గొన్న మోడీ.. ఇప్పుడు బైడెన్ వచ్చాక మాత్రం తొలిసారి యూఎస్ వెళ్లారు. అక్కడ మోడీ.. ఇవాళ బైడెన్ తో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చలు జరుపబోతున్నారు. అయితే అన్నింటికీ మించి ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం, పాకిస్తాన్ నుంచి దానికి అందుతున్న మద్దతుపై వీరిద్దరూ చర్చించబోతున్నారు.
తాలిబన్లకు పాక్ మద్దతే ప్రధాన అజెండా
మోడీ-బైడెన్ భేటీలో ఇరుదేశాలకు చెందిన పలు అంశాలు చర్చకు రాబోతుండగా.. ఇందులో ప్రధానంగా ఆప్ఘనిస్తాన్ అంశం ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో కొలువుదీరిన తాలిబన్ల సర్కార్, దానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు, పాక్ ఐఎస్ఐ ఛీఫ్ ఫైజ్ హమీద్ కాబూల్ పర్యటన వంటి విషయాన్ని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. దీంతో తాలిబన్లకు పాకిస్తాన్ తాలిబన్ల సర్కార్ కు ఏ విధంగా అండదండలు అందిస్తోందో బైడెన్ కు మోడీ వివరించి చెప్పబోతున్నారు.
హక్కానీలపైనా చర్చించే ఛాన్స్
తాలిబన్ల సర్కార్ లో ఉగ్రవాద గ్రూపు అయిన హక్కానీ నెట్ వర్క్ కు చెందిన నలుగురికి మంత్రి పదవులు దక్కాయి. పాకిస్తాన్ ఒత్తిడి మేరకే తాలిబన్లు హక్కానీ గ్రూప్ సభ్యుల్లో సిరాజుద్దీన్ హక్కానీతో పాటు మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. వీరంతా తిరిగి అమెరికా మోస్ట్ వాంటెండ్ జాబితాలో ఉన్నవారే. వీరిని కేబినెట్లో చేర్చుకోవడంపై అంతర్జాతీయంగా కూడా తాలిబన్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా పాకిస్తాన్ ఒత్తిడి ఉండటంతో వీరి విషయంలో కిమ్మనలేని పరిస్దితి. దీంతో హక్కానీల వ్యవహారంపైనా ఇవాళ్టి మోడీ-బైడెన్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
పాకిస్తాన్ అదృశ్య హస్తంపై ఫిర్యాదు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతిస్తున్నా పాకిస్తాన్ మాత్రం ఎక్కడా బయటపడటం లేదు. తాజాగా తాలిబన్లకు బహిరంగంగా ఓ హెచ్చరిక కూడా చేసింది. ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాద గ్రూపులకు ప్రభుత్వంలో చోటివ్వాలని, సమీకృత ప్రభుత్వ ఏర్పాటు జరగకపోతే అంతర్యుద్ధం తప్పదని కూడా హెచ్చరించింది. దీంతో ఉగ్రవాదులకు ప్రభుత్వ పదవులు ఇవ్వాలని బహిరంగంగానే తాలిబన్లను కోరినట్లయింది. దీంతో పాటు ఆప్ఘన్ గడ్డపై నుంచి పాకిస్తాన్ వ్యతిరేక గ్రూపుల్ని ప్రోత్సహించవద్దని, నియంత్రించాలని కూడా కోరింది. దీంతో పాకిస్తాన్ తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తుందో, తమకు ముప్పు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలాంటి సూచనలు చేస్తుందో కూడా భారత ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు బైడన్ కు వివరించబోతున్నారు.