పాకిస్తాన్ పై బాంబు పేల్చిన ఐక్యరాజ్య సమితి: దివాళా తీస్తారంటూ వార్నింగ్!
న్యూయార్క్: మనదేశంపై ఎప్పుడెప్పుడా అంటూ కాలు దువ్వడానికి రెడీగా ఉంటోన్న పాకిస్తాన్ పై బాంబు పేల్చింది ఐక్యరాజ్య సమితి. పొరుగు దేశంపై యుద్ధానికి కయ్యానికి దిగడం కంటే ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవాలని సూచించింది. పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీయడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మరి కొన్ని నెలలు కొనసాగితే.. ఇక కోలుకోవడానికి కూడా అవకాశం లేనంతగా ఆర్థిక ఊబిలో చిక్కుకుని పోవడం ఖాయమని పేర్కొంది. పతనం అంచుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఇదివరకు చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని వెల్లడించింది.
దటీజ్ ద బ్యూటీ ఆఫ్ కేరళ: బీజేపీ దారుణ ఓటమిపై బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్
ఆసియా దేశాల్లో వాణిజ్యం, అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఐక్యరాజ్య సమితి ఓ వార్షిక నివేదికను విడుదల చేసింది. పాకిస్తాన్ లో ఆర్థికంగా నెలకొన్న దుర్భర పరిస్థితులను ఈ నివేదిలో స్పష్టంగా వివరించింది. చైనా, సౌదీ అరేబియా సహా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకున్న తరువాత కూడా ఆ దేశ ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా ఎలాంటి మార్పూ కనిపించలేదని తన నివేదికలో పొందుపరిచింది. ఈ ఏడాది కాలంలో పాకిస్తాన్ కరెన్సీ విలువ అంతర్జాతీయ డాలర్ తో పోల్చుకుంటే దారుణంగా క్షీణించిందని, దీని ప్రభావం ఆ దేశ ఎగుమతి, దిగుమతి విధానాలపై చూపిందని పేర్కొంది.
బయటి దేశాల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీల రూపంలో చెల్లించే మొత్తాలే తడిసి మోపెడవుతున్నాయని, ఈ గండం నుంచి గట్టెక్కడానికి పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు తక్షణ చర్యలకు దిగక తప్పదని, కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఆసియా దేశాల్లో భారత్, చైనాల పనితీరు కూడా అంతంత మాత్రమేనని వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించిందని పేర్కొంది. భారత్ లో కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్నుల విధానం వల్ల క్రయ, విక్రయాలు గణనీయంగా తగ్గాయని ఈ నివేదికలో స్పష్టం చేసింది. జీఎస్టీకి ముందు క్రయ విక్రయాలు జోరుగా సాగినప్పటికీ.. పన్నుల విధానంలో మార్పులను తీసుకొచ్చిన తరువాత ప్రజలు పొదుపునకు అలవాటు పడినట్లు స్పష్టం చేసింది.