పాకిస్తాన్ గడ్డ ఉగ్రవాదులకు అడ్డ..! నిజం నిర్మొహమాటంగా ఒప్పుకున్న ప్రధాని ఇమ్రాన్..!!
ఇస్లామాబాద్/హైదరాబాద్ : ఉగ్రవాదుల గురించి, పాకిస్తాన్ లో వారి స్థావరాల గురించి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేసారు. పాకిస్థాన్ ఓ ఉగ్రవాద దేశమని భారత్ పదేపదే చెబుతున్నప్పటికి ప్రపంచ దేశాలు అంతగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు తమ దేశంలో ఉగ్రమూకలు విరివిగా ఉన్నాయని స్వయంగా ఆ దేశ ప్రదానే స్పష్టం చేశారు.
పాక్ గడ్డపై నుంచి 40 ఉగ్ర సంస్థలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని సభ్య దేశాలు నిర్ఘాంతపోయే సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే, ఈ చేదు నిజాన్ని గత 15 ఏళ్లుగా అమెరికాకు పాకిస్థాన్ చెప్పలేదని అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అమెరికాతో కలిసి తాము పని చేస్తున్నామని తెలిపారు ఇమ్రాన్. అమెరికాలోని ట్విన్ టవర్లను (9/11 అటాక్) ఉగ్రవాదులు కూల్చిన ఘటనతో పాకిస్థాన్ కు సంబంధం లేదని... ఎందుకంటే ఆ దాడికి పాల్పడిన ఆల్ ఖైదా ఆఫ్ఘనిస్థాన్ లో ఉందని చెప్పారు.
పాకిస్థాన్ లో తాలిబాన్లు లేకపోయినప్పటికీ అమెరికా చేస్తున్న యుద్ధంలో తాము కూడా చేతులు కలిపామని తెలిపారు.వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో 40 ఉగ్ర సంస్థలు పని చేస్తున్నాయని, దీనిపై తనలాంటి ఎందరో పాకిస్థానీయులు తీవ్ర ఆందోళన చెందామని, తాము బతకగలమా? అని భయపడ్డామని ఇమ్రాన్ గుర్తు చేసారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని గతంలో అమెరికా అడిగిందని, కానీ, అప్పుడు పాకిస్థాన్ సొంత మనుగడ కోసం పోరాడుతోందని ఇమ్రాన్ వివరణ ఇచ్చారు.
అమెరికాతో పాకిస్థాన్ అనుబంధం పరస్పర నమ్మకాల ఆధారంగా ఉండాలని ట్రంప్ కు తాను చెప్పానని ఇమ్రాన్ అన్నారు. శాంతిని నెలకొల్పే దిశగా పాకిస్థాన్ ఏం చేయబోతుందో అమెరికా అద్యక్షుడికి వివరించానని తెలిపారు. తాలిబాన్లతో చర్చలు జరిపేందుకు కృషి చేస్తున్నానని, ఇప్పటి వరకైతే తాము కొంత పురోగతి సాధించామని, అయితే, ఇది అనుకున్నంత సులభం కాదనే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశానని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.