పాక్పై మోడీదే పైచేయి, పరువుపోతోంది: ముషారఫ్ సంచలనం
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో ఏకాకిని చేసే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధాని మోడీ ప్రతి విషయంలోనూ పాకిస్థాన్ను డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న మోడీ.. పాకిస్థాన్ను ఏకాకిగా మారుస్తున్నారని అన్నారు.
పాక్కు గౌరవమేదీ?
అంతర్జాతీయంగా మోడీ చేస్తున్న దౌత్యపరమైన చర్యల వల్ల పాకిస్థాన్కు గౌరవం లేకుండా పోయిందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరే చెప్పండి పాకిస్థాన్కు అంతర్జాతీయంగా ఏమైనా గౌరవం ఉందా?' అని జర్నలిస్టును ఎదురు ప్రశ్నించారు ముషారఫ్.
ముషారఫ్ వితండవాదం
అంతేగాక, పాకిస్థాన్ దౌత్య నీతికి ఇక కాలం చెల్లినట్టేనని పేర్కొన్నారు. ‘భారత్ మనల్ని డామినేట్ చేస్తోంది. భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ గూఢచారి కాదని భారత్ వాదిస్తోంది, అటువంటప్పుడు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ అని మనమెందుకు చెప్పుకోవాలి' అని ముషారఫ్ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదులకు మద్దతుగా..
లష్కరే తొయిబా, జమాత్-ఉద్-దవాలు దేశభక్తి సంస్థలని ఇటీవల ముషారఫ్ పేర్కొనడం గమనార్హం. ఆ సంస్థలకు చెందిన వాలంటీర్లు దేశం కోసం కాశ్మీర్లో ప్రాణాలు అర్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేగాక, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్, జకీవుర్ రహ్మాన్ లఖ్వీలకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
పార్టీ పెట్టిన సయీద్.. అమెరికా హెచ్చరిక
ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన సయీద్ ఆధ్వర్యంలోని జమాత్-ఉద్-దవాను అమెరికా 2014లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ఇటీవల ప్రకటించిన హఫీజ్ సయీద్.. 2018 సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ మిల్లీ ముస్లిం లీగ్ పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశాడు. కాగా, ఇప్పటికే అమెరికా కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, పాక్ తమను మోసం చేసిందని, తమ నుంచి ఇక ఎలాంటి ఆర్థిక సాయం అందదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.