ఇదీ నయా పాకిస్తాన్, ఉగ్రవాదానికి అడ్డా: ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ/బెంగళూరు: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పైన కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది. ఇమ్రాన్ వ్యాఖ్యలపై ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించింది. పుల్వామా తీవ్రవాద దాడిని అసలు ఇమ్రాన్ ఖాన్ ఖండించలేదని పేర్కొంది. ఆయన ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడింది.
పుల్వామా తీవ్రవాద దాడిలో పాకిస్తాన్ గడ్డ పాత్రపై తమ వద్ద సరైన ఆధారాలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. పుల్వామా దాడికి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అజహర్ నేతృత్వంలోని జైష్ ఏ మొహమ్మద్ సహకరించిందని తెలిపింది. గతంలోని దాడులకు సంబంధించి కూడా తాము పాకిస్తాన్కు ఆధారాలు ఇచ్చామని పేర్కొంది.
ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రం
పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా పని చేస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పుల్వామా దాడిని ఇమ్రాన్ ఖాన్ ఖండించలేదని, కనీసం సంఘీభావం కూడా తెలపలేదని గుర్తు చేసింది. జైష్ ఏ మొహమ్మద్ సంస్థ తీవ్రవాద సంస్థ అని, వారు నిత్యం నేరాలు చేస్తుంటారని పేర్కొంది. ఆధారాలు ఉంటే ఇవ్వాలని, దర్యాఫ్తు చేస్తామని ఇమ్రాన్ అంటున్నారని, కానీ అది కుంటిసాకు అన్నారు. గతంలో కూడా ఆధారాలు ఇచ్చామని పేర్కొన్నారు.
పుల్వామా ఎఫెక్ట్... 48 గంటల్లో విడిచి వెళ్లండి: పాకిస్తానీలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
నయా పాకిస్తాన్ ఇదీ
పఠాన్కోట్ దాడికి సంబంధించి ఆధారాలు ఇచ్చామని, కానీ ఎలాంటి పురోగతి లేదని భారత్ పేర్కొంది. తీవ్రవాద దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చిన ఆధారాలపై ఏం చేశారో చెప్పాలని నిలదీసింది. ఐక్య రాజ్య సమితి నిషేధించిన హఫీజ్ సయీద్ వంటి వారితో పాకిస్తాన్ మంత్రులు కనిపిస్తున్నారని, ఇది నయా పాకిస్తాన్ అని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలు అని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు చెబుతున్నారని, కానీ ప్రశాంత వాతావరణంలో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమని భారత్ ఎప్పుడో ప్రకటించిందని చెప్పింది. తీవ్రవాదానికి అతిపెద్ద బాధితులం తామేనని (పాకిస్తాన్) ఇమ్రాన్ ఖాన్ చెప్పారని, కానీ అది వాస్తవం కాదని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రంగా ఉందని భారత్ మండిపడింది. ఇది అంతర్జాతీయ సమాజానికి కూడా తెలుసునని చెప్పింది.
నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
బెంగళూరులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పుల్వామా వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పుల్వామా దాడికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. పుల్వామా దాడి నేపథ్యంలో మన ఆర్మీకి ఇప్పటికే ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు.