పాక్ తన నాశనాన్ని కోరుకుంది: ‘ప్రధాని’ ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ విజయం దాదాపు ఖరారైంది. స్వతంత్రుల మద్దతుతో పీటీఐ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రధాని అవుతున్న నేపథ్యంలో..
ఇటీవల రెహామ్.. ఇమ్రాన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్కు ఐదుగురు సంతానమని, వారిలో భారతీయులు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ అయిన రెహామ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్కు మాజీ రెండో భార్య. తాజాగా ఆయన ప్రధాని పీఠానికి దగ్గరవుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు చేశారు.
పాకిస్థాన్ సర్వనాశనం
‘ఎందుకు అందరూ షాక్ అవుతున్నారు? ఎన్నికల ఫలితాలు ఊహించినవే కదా?' అంటూ రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఇదే వాళ్లకు కావాల్సింది.. స్వయం నాశనాన్ని కోరుకుంటున్న దేశాన్ని ఎవరు మాత్రం కాపాడగలరు? అని పాకిస్థాన్ను ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ప్రధాని అయితే పాకిస్థాన్ అక్కడే వుండిపోతుందని, తనలా వెళ్లలేదని చెప్పారు. ఇమ్రాన్ ప్రధాని అవడం అంటే పాక్ ప్రజలందర్నీ మూర్ఖులను చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
మొదటి భార్య అభినందనలు
ఇది ఇలా ఉంటే, ఇమ్రాన్ ఖాన్ విజయంపై ఆయన మొదటి మాజీ భార్య జెమీమా గోల్డ్స్మిత్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయనకు అభినందనలు కూడా తెలిపారు.
నా కొడుకుల తండ్రి పాక్ ప్రధాని..
‘22 ఏళ్ల తర్వాత, అవమానాలు, అడ్డంకులు, త్యాగాల అనంతరం నా కొడుకుల తండ్రి పాకిస్థాన్కు ప్రధాని కాబోతున్నారు. పట్టుదల, నమ్మకం, ఓటమిని అంగీకరించలేకపోవడం విషయాల్లో గొప్ప పాఠం ఇది. ఆయన రాజకీయాల్లో ఎందుకు వచ్చారో గుర్తుంచుకోవడమే ప్రస్తుతం ఆయన ముందున్న సవాల్. అభినందనలు ఇమ్రాన్ ఖాన్' అని జెమీమా ట్వీట్ చేశారు. కాగా, ఇమ్రాన్, జెమీమా 1995లో పెళ్లి చేసుకుని 2005లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె తన ఇద్దరు కొడుకులతో లండన్కు వెళ్లిపోయారు. కాగా, ఇమ్రాన్ ఇటీవల మత బోధకురాలైన బుష్రా మనేకాను మూడో వివాహం చేసుకున్నారు.