భారత సిక్కులకు పాక్ అపూర్వ కానుక: గురునానక్ పై నాణేలు..యూనివర్శిటీ ఏర్పాటు
ఇస్లామాబాద్: సిక్కు మత స్థాపకుడు గురునానక్ పై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. గురు నానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ నాణేలను ముద్రించినట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. నాణం ఫొటోను ఆయన బుధవారం తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వచ్చే నెల 9వ తేదీన భారత్ కు చెందిన వేలాదిమంది సిక్కులు పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ ను సందర్శించబోతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని నరోవాల్ జిల్లాలో గల కర్తార్ పూర్ గురుద్వారను సందర్శించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం విసాలను ఇదివరకే జారీ చేసింది.
టిప్పు సుల్తాన్ కు బద్ధ వ్యతిరేకిని..ఆ జ్ఞాపకాలను చెరిపేస్తాం.. పాఠ్య పుస్తకాల్లోంచి కూడా: అగ్గి రాజ
రూ.50 విలువ గల నాణేలు..
గురు నానక్ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని 50 రూపాయల విలువ గల నాణేలను లక్షల సంఖ్యలో ముద్రించినట్లు ఎవాక్యు ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ఛైర్మన్ డాక్టర్ అమీర్ అహ్మద్ వెల్లడించారు. ఈ నాణేలను భారతీయ సిక్కుల కోసం అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపారు. కర్తార్ పూర్ గురుద్వారను సందర్శించడానికి భారత్ సహా విదేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చే సిక్కులు వాటిని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. గురు నానక్ ను ఆరాధించే పాకిస్తానీయులు కూడా వాటిని కొనుగోలు చేయవచ్చని, దాన్ని పెద్త ఎత్తున చలామణిలోకి తీసుకొస్తామని అన్నారు.
గురు నానక్ పేరు మీద యూనివర్శిటీ..
గురు నానక్ పేరు మీద ఓ విశ్వవిద్యాలయాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్మించబోతోంది. దీనికి సోమవారం నాడే శంకుస్థాపన చేసింది. బాబా గురు నానక్ పేరుతో ఈ యూనిర్శిటీ నిర్మితం కానుంది. నన్కనా సాహిబ్ ప్రాంతంలో దీన్ని నిర్మించబోతోంది. నన్కనా సాహిబ్ ప్రాంతంలోనే గురు నానక్ జన్మించిన విషయం తెలిసిందే. తమ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న సిక్కులు ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. వారి మనోభావాలు, అకాంక్షలకు అనుగుణంగా ఈ యూనివర్శిటీని నిర్మిస్తామని అన్నారు.