ముంబై దాడుల టెర్రరిస్టులకు షాక్ - హఫీజ్ బావమరిది సహా ముగ్గిరికి జైలు శిక్ష- ఆంక్షల భయంతో పాక్ చర్యలు
2008 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ జమాత్ ఉల్ దవా(జేయూడీ), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థలకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రనేతలకు పాకిస్తాన్ కోర్టు శిక్షలు విధించింది. అందులో ఒకడు జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు స్వయాన బావమరిది కావడం గమనార్హం. ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు కొనసాగుతోన్న దరిమిలా వాటి నుంచి తప్పించుకునేందుకు పాక్ ఈ తరహా చర్యలకు దిగుతున్నది.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే ఆరోపణలు రుజువుకావడంతో హఫీజ్ సయీద్ బావమరిది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ(జేయూడీ), మాలిక్ జాఫర్ ఇక్బాల్(ఎల్ఈటీ), హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టావి(ఎల్ఈటీ)లను లాహోర్ యాంటీ టెర్రరిస్టు ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. మక్కీ తలపై ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ 2మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించగా, భారత్ సైతం అతణ్ని టెర్రరిస్టుగా గుర్తించింది. నేరం రుజువు కావడంతో మక్కీకి కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.20వేల జరిమాన విధించింది. అలాగే..
మాలిక్ జాఫర్ ఇక్బాల్(ఎల్ఈటీ)కి గరిష్టంగా 16 సంవత్సరాల జైలు, రూ.1.7లక్షల జరిమాన పడగా, సలాం భుట్టావి(ఎల్ఈటీ)కి ఏడాదిన్నర జైలు, రూ.20వేల జరిమాన విధించారు. ఆగస్టు 18న పాక్ విదేశాంగ శాఖ.. ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన టెర్రరిస్టుల జాబితాలో ఈ ఇద్దిర పేర్లు కూడా ఉన్నాయి. గరిష్ట జైలు శిక్ష పడిన ఇక్బాల్ ఎల్ఈటీ, జేయూడీ వ్యవస్థాపక సభ్యుడిగా, 2008 ముంబై దాడులు సహా అనేక దాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
Recommended Video
ఉగ్రవాదులకు నిధులు, సహకారంపై నిఘా ఉంచే 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)' గ్రే లిస్ట్ నుంచి తప్పించుకోడానికి పాకిస్తాన్ నానా పాట్లు పడుతోంది. సెప్టెంబర్ లోగా గ్రే లిస్టు నుంచి బయటపడితేగానీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి ఉండదు. దీంతో ఇన్నాళ్లూ తానే పెంచిపోషించిన 88 నిషేధిత ఉగ్రసంస్థలు, వాటి అధినేతలపై పాక్ సర్కారు ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముగ్గురు టెర్రరిస్టులను జైళ్లలో పడేసింది.