రెండు బస్సులను అపహరించి.. 20మందిని కాల్చి చంపారు
ఇస్లామాబాద్: 43 మంది ప్రయాణికుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన కరాచీ బస్సు ఘటన మరువకముందే పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిని ఉగ్రవాదులు అతిదారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
క్వెట్టా నుంచి కరాచీ బయలుదేరి రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికుల్ని.. సెక్యూరిటీ గార్డు దుస్తులు ధరించిన సాయుధ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకుని ఉగ్రవాదులు వెళుతోన్న బస్సును చేజ్ చేసే ప్రయత్నం చేశారు.
ఆ క్రమంలో ఇరువర్గాలకు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కళ్లుగప్పి బస్సును ఓ కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లిన ఉగ్రవాదులు 20 మంది ప్రయాణికుల్ని అతి సమీపం నుంచి కాల్చిచంపి పారిపోయారు. మరికొద్దిసేపటికి భద్రతా బలగాలు బస్సు ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగారు.
ఉగ్రవాదుల దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురిని కాపాడగలిగామని, మిగతావారి జాడ ఇంకా తెలియదని బెలూచిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫరాజ్ బుగ్తి మీడియాకు చెప్పారు. కాగా, మే నెల రెండో వారంలో కరాచీకి సమీపంలో షియా మైనారిటీలు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 47 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే.
తాజా ఘటనకు బాధ్యతవహిస్తూ ఉగ్రవాద సంస్థలేవీ ఇప్పటి వరకు ఏ ప్రకటన విడుదలచేయలేదు. దీంతో బెలూచిస్థాన్ వేర్పాటు వాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రయాణికుల మరణాలపట్ల ప్రధాని నవాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.