పుల్వామా టెర్రర్ అటాక్: పీఎస్ఎల్ ప్రసారాల నుంచి వైదొలిగిన ఐఎంజి రిలయెన్స్
దుబాయ్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) క్రికెట్ ప్రసారాల నుంచి వైదొలగుతున్నట్లు ఐఎంజి-రిలయెన్స్ ప్రకటన చేసింది. ఇటీవల పుల్వామాలో జరిగిన దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై దేశం యావత్తు ఆగ్రహంతో ఉంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్ రద్దు చేసింది. ఆ తర్వాత పాక్ నుంచి వచ్చే వస్తువులపై 200 శాతం సుంకం విధించింది. పుల్వామా దాడిపై భారత్ మొత్తం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ ప్రసారాల నుంచి ఐఎంజి రిలయెన్స్ వైదొలగుతోంది.
ఈ మేరకు ఐఎంజీ రిలయన్స్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలిపింది. దాడిని తీవ్రంగా ఖండించిన సంస్థ తక్షణమే పీఎస్ఎల్ ప్రసారాల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. భద్రతా కారణాలరీత్యా ప్రస్తుతం టోర్నీని యూఏఈలో నిర్వహిస్తుండగా నాకౌట్ మ్యాచ్లను పాకిస్థాన్లోని లాహోర్, కరాచీలలో నిర్వహిస్తున్నారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్లను ప్రసారం చేసేందుకు ఐఎంజీ రిలయన్స్ గతంలో పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. అటు ప్రసారాల నుంచి రిలయన్స్ తప్పుకున్నట్లు అధికారికంగా ధ్రువీకరించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మరో సంస్థ కోసం అన్వేషణ ప్రారంభించింది.