పాక్ బరితెగింపు: ముక్కలుగా భారత జవాన్ల దేహాలు! రగిలిపోతున్న భారత సైనికులు!
సరిహద్దుల్లో పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. ఇద్దరు భారత జవాన్లను పొట్టనబెట్టుకోవడమే కాక.. వారి మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకాన్ని చాటుకుంది.
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎల్వోసీ మీదుగా ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి ఇద్దరు జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది.
అంతేకాకుండా వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకాన్ని చాటుకుంది. కృష్ణగాటి సెక్టార్లో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.
పాక్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ అధికారితోపాటు, ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలు విడవగా, మరో జవానుకు గాయాలయ్యాయని సైనిక వర్గాలు తెలిపాయి.
వెంటనే ఈ కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిచ్చిందని, కానీ, పాక్ సైన్యం పిరికిపందల తరహాలో జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసిందని, అత్యంత హేయమైన ఈ చర్యకు తాము కూడా దీటుగా బదులిస్తామని ఆర్మీ నార్తరన్ కమాండ్ ఓ ప్రకటనలో హెచ్చరించింది.
కశ్మీర్లో అలజడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలతో చెలరేగిపోతోంది. గత నెలలో ఏడుసార్లు దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజా ఘటనతో మళ్లీ ఒకసారి భారతదేశంపై తనకున్న కసి ఏమిటో చెప్పకనే చెప్పింది పాకిస్తాన్. మరి దీనికి మనదేశ బలగాలు ఎలా బదులిస్తాయో వేచి చూడాల్సిందే.