గుజరాత్ సరిహద్దుల్లో కలకలం: పాక్ జలాల్లో ప్రవేశించిన భారత జలాంతర్గామి?
కరాచీ: జమ్మూ కాశ్మీర్ లో భారత్- పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరస్పర వైమానిక దాడుల వల్ల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తొలగిపోలేదు. అదే సమయంలో గుజరాత్ లో పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా మంగళవారం కలకలం చెలరేగింది.
భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి ఒకటి తమ దేశ సముద్ర జలాల్లో ప్రవేశించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. తీర ప్రాంత నగరం కరాచీ సమీపంలో భారత్-పాక్ సరిహద్దు జలాల్లో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి.. సరిహద్దులను దాటి, తమ దేశ జలాల్లో చొరబడటానికి ప్రయత్నించిందని, దాన్ని తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను పాకిస్తాన్ నౌకాదళ అధికార ప్రతినిధి విడుదల చేశారు.
సముద్ర జలాల్లో చొరబాటునకు ప్రయత్నించి భారత జలాంతర్గామిని తమ నౌకాదళ బలగాలు సమర్థవంతంగా వెనక్కి పింపించేశాయని ఆ దేశ నౌకాదళ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత జలాంతర్గామి తమ సముద్ర జలాల్లో చొరబాటునకు ప్రయత్నించడం మూడేళ్ల కాలంలో ఇది రెండోసారి అని అధికార ప్రతినిధి తెలిపారు. తమ దేశ సముద్ర జలాల్లోకి వచ్చినప్పటికీ.. భారత జలాంతర్గామిని తాము లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు. భారత్ తో శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నందున తాము దానిపై దాడులు చేయలేదని చెప్పారు.