కాశ్మీర్లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేనని
ఇస్లామాబాద్: కాశ్మీర్ లోయలో హింసను ప్రేరేపించే శక్తి తమ దేశానికి ఉందని పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ పేర్కొన్నారు. స్వదేశంలో పీకల్లోతు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న ముషారఫ్ మరోసారి భారత్పై ఈ విధమైన వ్యాఖ్యలతో తన అక్కసును వెళ్లబోసుకున్నారు.
భారత్-పాకిస్థాన్ల మధ్య మరో యుద్ధం జరుగుతుందని స్థానిక మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు. కాశ్మీర్ కోసం పోరాడటానికి లక్షలాది మంది పాకిస్థాన్ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
‘కాశ్మీర్ రగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ హింసను ప్రేరేపించే శక్తి పాకిస్థాన్కు ఉంది' అని ముషారఫ్ వ్యాఖ్యానించినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. పాకిస్థాన్ గత కొన్ని రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంట, అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత్లో ఉన్న గ్రామాలపై, బిఎస్ఎఫ్ పోస్టులపై కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే.
అయితే ముషారఫ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్కు కొన్ని పరిమితులు ఉన్నాయని, తమ బలగాలు తలపడితే కాశ్మీర్ సహోదరులు దెబ్బతింటారనే ఆందోళన ఉందని, కానీ భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి ఆ ఆందోళన లేదని 1999 కార్గిల్ యుద్ధానికి సూత్రధారి అయిన ముషారఫ్ అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లింల వ్యతిరేకి అని, పాకిస్థాన్ వ్యతిరేక రాజకీయ నాయకుడని ఆయన ఆరోపించారు. మే 26వ తేదీన జరిగిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధామంత్రి నవాజ్ షరీఫ్ హాజరుకావడాన్ని ముషారఫ్ ఈ సందర్భంగాతప్పుబట్టారు.