కరోనా దుర్మార్గం: పాక్లో హిందువుల ఆకలి కేకలు.. రేషన్ నిరాకరణ.. మోడీ పంపుతాడని ఎద్దేవా..
కరోనా వైరస్ బారి నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశవ్యాప్త లాక్ డౌన్ ను భరించే ఆర్థిక స్థోమత పాక్ ప్రభుత్వానికి లేదని, పూర్తిగా షట్ డౌన్ అయిపోతే పేదలు ఆకలితో చనిపోయే ప్రమాదముందని, కాబట్టి ప్రజలే నియంత్రణ పాటించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా పిలుపునిచ్చారు. ఆయన ప్రకటనతో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారాయంటే..
మోస్ట్ ఎఫెక్టెడ్..
ఎకనామిక్ కారిడార్ నిర్మాణం పేరుతో చైనాతో పెనవేసుకుతిరుగుతోన్న పాకిస్తాన్ లోకి కరోనా వైరస్ మూడు నెలల కిందటే ప్రవేశించింది. కానీ దానికి సంబంధించిన వివరాలేవీ వెల్లడికాలేదు. ఎప్పుడైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) కరోనాను పెడమిక్(మహమ్మారి)గా డిక్లెర్ చేసిందో.. ఆ తర్వాత మాత్రమే కేసుల్ని అధికారికంగా నమోదు చేయడం మొదలుపెట్టారు. నిర్బంధం లేని కారణంగా పరిస్థితులు చేయిదాటేదాకా వచ్చాయి. ప్రస్తుతం దక్షిణాసియాలో.. వైరస్ ను అతి వేగంగా వ్యాప్తి చేస్తున్న దేశంగా పాకిస్తాన్ నిలిచింది.
ఇంత జరుగుతున్నా..
సోమవారం మధ్యాహ్నం నాటికి పాకిస్తాన్ లో కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 1664గా నమోదైంది. ఇప్పటిదాకా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. పాక్ ఆహారోత్పత్తిలో కీలక భూమిక పోషించే పంజాబ్(638 కేసులు), సింధ్(508 కేసులు) ప్రాంతాల్లోనే వైరస్ విలయతాండవం చేస్తుండటం రైతాంగానికి కంటిమీద కునుకులేకుండా పోయింది. అంతర్జాతీయ సరిహద్దుల మూసివేతపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఇరాన్, అఫ్గానిస్తాన్ ద్వారా వైరస్ బాధితుల రాకపోకలపై నియంత్రణ లేకుండాపోయింది. ఇంత జరుగుతున్నా లాక్ డౌన్ కు మాత్రం ప్రధాని ఇమ్రాన్ అంగీకరించడంలేదు.
హిందువులకు రేషన్ నిరాకరణ..
ప్రధాని ఇమ్రాన్ ఎంతకీ లాక్ డౌన్ ప్రకటించకపోవడంతో.. ఆయన తీరుతో విసిగిపోయిన స్థానిక ప్రభుత్వాలు.. ఎక్కడికక్కడ కట్టడి ఉత్తర్వులు జారీచేశాయి. ధియేటర్లు, బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించాయి. కరోనా విలయం మరికొంత కాలం కొనసాగొచ్చనే భయాల నేపథ్యంలో ఆహార ధాన్యాల సరఫరాపైనా ప్రభుత్వం కోత విధించింది. మరీ దారుణంగా, మైనార్టీ వర్గాలైన హిందువులకు ఏకంగా రేషన్ సరుకులు ఇచ్చేందుకు దుకాణం దారులు, సంస్థలు నిరాకరిస్తుండటం వివాదాస్పదమైంది.
క్యూ లైన్ల నుంచి గెంటివేత..
పాకిస్తాన్ లో కరోనా వైరస్ ప్రభావం ఆ దేశ ఆర్థిక రాజధాని కరాచీపై ఎక్కువగా ఉంది. దీంతో సింధ్ రాష్ట్రమంతటా సరుకుల రవాణాలను ప్రభుత్వమే నియంత్రణలోకి తీసుకుంది. కరాచీలో సిటీతోపాటు శివారు ప్రాంతాల్లోని పేదలకు ఓ స్వచ్ఛంద సంస్థ రేషన్ సరుకుల్ని పంచేందుకు ముందుకురాగా.. ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకుని, పింపిణీని కట్టడి చేశారు. దాదాపు 3వేల మంది క్యూలైన్లో నిలబడగా, ముస్లింలకు మాత్రమే సరుకులు ఇస్తామని, హిందువులు వెళ్లిపోవాలని ఆదేశించారు. కరాచీ సిటీతోపాటు సింధ్ అంతటా ఇలాంటి ఘటనలు జరిగాయని, పేద హిందువులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది.
భారత్ను లాగే ప్రయత్నం..
పాకిస్తాన్ లో మైనార్టీ హిందువులకు రేషన్ సరుకుల నిలిపివేతపై స్థానిక రాజకీయ కార్యకర్త డాక్టర్ అజ్మద్ ఆయూబ్ మిర్జా ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాలు ఉద్దేశ పూర్వకంగానే ఈ పనిచేస్తున్నాయని, ఈ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పందించాలని పాక్ అధికారులు భావిస్తున్నారని, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుగుండా ఆహారపదార్థాల చేరవేతకు భారత ప్రభుత్వం సంకల్పించేదాకా హిందువులను పస్తులుంచే ప్రమాదం కూడా ఉందని ఆయూబ్ మిర్జా చెప్పారు. సరుకుల కోసం క్యూలైన్లలో నిలబడ్డ హిందువులను వెళ్లగొడుతూ.. ‘‘తిండి కావాలంటే మోదీని అడుక్కోండి..''అని అధికారులు ఎద్దేవా చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం వీటిని కొట్టిపారేసింది. ఇదంతా పాక్ వ్యతిరేకుల ప్రాపగండా అని పేర్కొంది.