కాశ్మీర్పై బిలావల్ వ్యాఖ్య: చిన్నపిల్లాడిలా అని బీజేపీ
న్యూఢిల్లీ: ‘కాశ్మీర్ను తిరిగి వెనక్కు తీసుకువస్తాను. ఏ ఒక్క అంగుళాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే, అది పాకిస్థాన్ లోనిది' అన్న బిలావల్ భుట్టో వ్యాఖ్యల పైన పలువురు నేతలు మండిపడ్డారు. బిలావల్ మాటలు చిన్నపిల్లాడి వ్యాఖ్యల్లా ఉననాయని, అపరిపక్వతను చాటుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ అన్నారు.
కాశ్మీర్.. భారత్లో ఎప్పటికీ అంతర్భగంగానే ఉంటుందని చెప్పారు. దాని పైన చర్చ తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. పాకిస్తానీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం పరిపాటేనని, సరిహద్దులను కాపాడుకుంటూ తగిన సమాధానం చెప్పడంలో భారత సైన్యానికి పూర్తి సమర్థత ఉందన్నారు.
రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని బిలావల్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పలువురు బీజేపీ నేతలు అన్నారు. అస్థిత్వాన్ని చాటుకునేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, భారత్ చేతిలో ఎదురైన ఓటములను పాకిస్తాన్ మరిచిపోరాదని హితవు పలికారు.
కాగా, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీ కాశ్మీర్ అంశంపై సంచలనం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ కాశ్మీర్ మొత్తాన్ని వెనక్కి తీసుకొస్తుందని అన్నారు. ఈ మేరకు ముల్తాన్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు.