గాడిదలు అమ్ముకుంటున్న పాకిస్తాన్
ఇస్లామాబాద్: బేవార్స్ గా ఇంట్లో కూర్చుని, పనీ పాటా లేకుండా, తినడం, తొంగోవడం అనే కాన్సెప్ట్ తో బండిని లాగించేస్తుంటారు కొందరు బద్దకిస్టులు. అలాంటి జనాలను గాడిదలతో పోల్చుతుంటారు ఇంట్లో పెద్దవాళ్లు. చివరికి..గాడిదలు తోలడానికి కూడా పనికిరావు.. అనే ముద్రను వేయించుకుంటారు. అయినా వారు అలాంటి మాటలను లైట్ గా తీసుకుంటుంటారు. అది వేరే విషయం. అలాంటి గాడిదలు ఇప్పుడు ఓ దేశానికి తిండి పెడుతున్నాయంటే నమ్మగలరా? నమ్మలేం కదా? ఇది నిజం. ఆ దేశం మరేదో కాదు..మన పొరుగునే ఉన్న పాకిస్తాన్. గాడిదలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది ఆ దేశం. దీనికి కారణం- అక్కడ నెలకొన్న ఆర్థిక పరిస్థితులే.
ఆర్థికపరంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది పాకిస్తాన్. మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పగ్గాలను ఏ ముహూర్తంలో అందుకున్నారో గానీ.. అప్పటి నుంచీ పైసల్లేక అల్లాడుతోంది. చివరికి- విలాసవంతమైన కార్లను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్ముకుంటున్నారు కూడా. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చే నిధులతోనే పాకిస్తాన్ కాలం గడుపుతోంది. ఎప్పటికప్పుడు ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీలను తీసుకుంటోంది. ఈ చర్యలన్నీ ఆ దేశానికి తాత్కాలిక ఊరటను ఇచ్చేవి మాత్రమే.
ఇలాంటి తాత్కాలిక చర్యల్లో భాగంగా.. గాడిదలను అమ్ముకునే ప్రణాళికను తెర మీదికి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. తమ దేశంలో జులాయిగా తిరుగుతున్న గాడిదలన్నింటినీ ఓ గాటన కట్టేసి,కంటైనర్లలో నింపి చైనాకు విక్రయించాలని నిర్ణయించింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ప్రపంచం మొత్తం మీద గాడిదల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో పాకిస్తాన్ ది మూడో స్థానం. ఎలా లెక్క పెట్టారో తెలియట్లేదు గానీ.. పాకిస్తాన్ లో ఉన్న గాడిదల సంఖ్య అరకోటికి పైమాటే. ఎక్కడపడితే అక్కడ అడ్డంగా కనిపిస్తుంటాయవి. అందుకే- కనిపించిన వాటిని కనిపించినట్టే పట్టేసుకుని చైనాకు ఎగుమతి చేయాలనే నిర్ణయానికి వచ్చిందట.
ప్రస్తుతం చైనా అందజేసే ఆర్థిక సహాయ, సహకారాలే పాకిస్తాన్ కు పెద్ద దిక్కు. చైనా నుంచి తీసుకుంటున్న నగదుకు బదులుగా గాడిదలను ఎగుమతి చేయాలని పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి చైనా కూడా సరేనంది. ఇంత పెద్ద సంఖ్యలో గాడిదలను తీసుకుని చైనా ఏం చేసుకుంటుందనే డౌటానుమానం రావడం నేచురల్. దీనికి ఆ దేశం ఇచ్చే సమాధానం ఒక్కటే. చైనాలో గాడిదల పాలు, రక్తం, చర్మాన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారట. గాడిదల చర్మం నుంచి వెలువడే ఓ రకమైన జెల్ ను ఔషధాల తయారీలో వాడతారని చెబుతున్నారు. గాడిద పాలకు ఉన్న ప్రాముఖ్యత మనకూ తెలుసు. ఇంటింటికీ తిరుగుతూ గాడిద పాలను విక్రయించే వారు ఇప్పటికీ హైదరాబాద్ లో కనిపిస్తుంటారు. గాడిద పాలల్లో ఔషధ తత్వాలు ఎక్కవ. చిన్నపిల్లలకు ఆ పాలను తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ఇక పాక్ విషయానికి వస్తే.. ఆ దేశంలోని ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రాంతంలో గాడిదలను మేపడానికీ, గొర్రెలు, బర్రెల తరహాలో వాటిని పెంచి పోషించడానికీ చైనా ఆసక్తిగా చూపుతోందని అధికారులు వెల్లడించారు. దీని విలువ సుమారు 21 వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో గాడిదలను పెంచి, పోషించడానికి చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పాక్ పశు సంవర్ధక శాఖ అధికారులు స్పస్టం చేశారు.