హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ షాక్?: శాశ్వతంగా నిషేధించే యోచన
కరాచీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే ఉద్ దవా (జేయూడీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పైన పాకిస్తాన్ శాశ్వత నిషేధం విధించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్థానిక డాన్ పత్రికలో కథనం వచ్చింది.
1997 నాటి యాంటీ టెర్రరిజం యాక్ట్ (ఏటీఏ)లో పాకిస్తాన్ సవరణలు చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లును పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో చర్చకు తీసుకురానున్నట్లు కథనంలో పేర్కొంది.
ఈ బిల్లుకు పాక్ అసెంబ్లీ, సెనేట్ అంగీకారం తెలిపితే హఫీజ్ పైన శాశ్వత నిషేధం విధించే అవకాశముంటుంది. మనీలాండరింగ్, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించేందుకు ఈ బిల్లు రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది.
ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అమెరికా ఒత్తిడి, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి విడుదల చేసిన ఉగ్రవాద జాబితాలో హఫీజ్ సయీద్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆ దిశగా అడుగులు వేస్తోన్నట్లుగా తెలుస్తోంది.