హఫీజ్ సయీద్కు పాక్ షాక్: సీజ్కు యాక్షన్ ప్లాన్
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు కళ్లెం వేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కార్యాచరణను రూపొందించి, అమలు చేయడానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ రహస్య పత్రం వెలుగు చూసింది.
హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అతడి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. అతనికి కళ్లెం వేసేందుకు నిరుడు డిసెంబరు 19న ప్రావిన్స్, ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు రహస్య ఆదేశాలు జారీ చేసింది.
వాటిని సీజ్ చేసేందుకు..
హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు చారిటీలు జమాత్-ఉద్-దవా (జేయూడీ), ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్)లను స్వాధీనం చేసుకునేందుకు డిసెంబరు 28 లోగా కార్యాచరణ ప్రణాళికను అందజేయాలని ఐదు ప్రావిన్సుల ప్రభుత్వాలను ఆదేశించినట్లు సమాచారం.
అమెరికా టెర్రరిస్టు సంస్థలుగా గుర్తించింది...
జేయూడీ, ఎఫ్ఐఎఫ్లను అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది. 1987లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ లష్కరే తాయిబాని స్థాపించాడు. దీని ఆధ్వర్యంలోనే ఈ సంస్థలు కూడా నడుస్తున్నాయి. 2008 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సాయిదేనని భారత్, అమెరికాలు ఆరోపిస్తున్నాయి. నాటి పేలుళ్లలో 166 మంది మృతి చెందారు.
సంబంధం లేదని చెప్పాడు..
ముంబై పేలుళ్లతో తనకు సంబంధం లేదని సయీద్ చెబుతూ వస్తున్నాడు. పాకిస్థాన్ కోర్టు కూడా తగిన ఆధారాలు లేవనే కారణంతో అతడిని దోషిగా తేల్చడం లేదు. హఫీజ్ సయీద్ ఆట కట్టించాలనే ఉద్దేశంతో భారత్ పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడి పెడుతోంది.
ఇలా చేస్తున్నారని..
డిసెంబరు 19 నాటి ప్రభుత్వ డాక్యుమెంటులో సయీద్ ఆస్తుల స్వాధీనానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా కోరుతూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)కి ఆదేశాలు జారీ చేసింది.