పాకిస్థాన్ లో సైనిక తిరుగుబాటు ? సేమ్ సీన్ రిపీట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో చరిత్ర పునరావృతమవుతోంది. అక్టోబర్ 12 వస్తుందంటే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండెట్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాను నియమించిన ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముష్రఫ్ 1999 అక్టోబర్ 12న నవాజ్ షరీఫ్ ను కూల్చి అతను గద్దెనెక్కాడు.
ఇప్పుడు మళ్లీ అదే అక్టోబర్ 12న నవాజ్ షరీఫ్ ను గద్దె దించడానికి పాక్ ఆర్మీ పావులు కదుపుతుంది. ఇప్పటి పాక్ ఆర్మీచీఫ్ రహీల్ షరీఫ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఊరీ ఉగ్రదాడి తరువాత వారి మద్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది.
అక్టోబర్ 12వ తేది దగ్గర పడటంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వనికిపోతున్నారు. ఇప్పటికే ఐఎస్ఐ చీఫ్ ను మార్చాలని నిర్ణయం తీసుకున్న పాక్ ప్రభుత్వానికి ఆర్మీ కచ్చితంగా షాక్ ఇస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
పాక్ లో ప్రజాస్వామ్య మనుగడ అంత సులభమైనది కాదనే విషయం ప్రపంచానికే తెలుసు. పాకిస్థాన్ ప్రజలు కూడా అక్కడి ప్రభుత్వాని కంటే ఎక్కువగా సైన్యం మీద ఆధారపడుతారు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆర్మీ సైనిక తిరుగుబాటు చేస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి గద్దెనెక్కుతున్నాయి.
1999 అక్టోబర్ 12వ తేది అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను గద్దె దింపిన అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముష్రఫ్ గద్దెనెక్కారు. ఆర్మీతో విభేదాలు ఉండటం వలనే అప్పుడు నవాజ్ షరీఫ్ ను గద్దె దించారు. ఇప్పుడు కూడా నవాజ్ షరీఫ్ కు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ కు విభేదాలు ఉన్నాయి.
1999 పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఒకేలాగ ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 1999 మొదట్లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పాకిస్థాన్ కు బస్సు యాత్ర చేశారు.
తిరిగి భారత్ వస్తున్న సమయంలో సరిహద్దు దాటుతున్న వాజ్ పేయికి అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషరఫ్ సెల్యూట్ చేశారు. తరువాత కాశ్మీర్ కు చెందిన హురియత్ నేతలను అరెస్టు చేసి జోధ్ పూర్ జైలుకు తరలించారు.
1999 అక్టోబర్ 12వ తేదిన పాక్ ప్రపంచానికి షాక్ ఇచ్చే వార్త వెల్లడించింది. ప్రధాని నవాజ్ షరీఫ్ ను గద్దె దించి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషరఫ్ గద్దె ఎక్కారని ప్రపంచానికి చెప్పింది. ఇప్పుడు హురియత్ నేతలు జైల్లో ఉన్నారు.
17 సంవత్సరాల తరువాత మళ్లీ అదే సీన్ పాక్ లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊరీ ఉగ్రదాడి తరువాత భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసి ఉగ్రవాదులను అంతం చెయ్యడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ విషయంపై ప్రతిపక్షాలు నవాజ్ షరీఫ్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి. పీవోకే లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ దాడుల తరువాత ప్రభుత్వానికి, పాక్ ఆర్మీ మధ్య చిచ్చురగిలింది. ఆర్మీ తిరగబడటానికి సిద్దంగా ఉంది. ఆర్మీకి ప్రతిపక్షాలు సైతం మద్దతు ఇవ్వడంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హడలిపోతున్నారు.