‘పనికి రాడు’: నవాజ్ షరీఫ్నే అమ్మకానికి పెట్టారు!
ఇస్లామాబాద్: మీకు అవసరం లేదా? అయితే అమ్మేసెయ్ అంటూ పాత వస్తువుల అమ్మకం వెబ్సైట్లు విరివిగా ప్రకటనలిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఈ-కామర్స్ వెబ్సైట్లలో అమ్మకాల నిమిత్తం అనేక వస్తువులుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక్కడ మాత్రం ఏకంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్నే పాత వస్తువుల అమ్మకం వెబ్సైట్ అయిన 'ఈ బే'లో పెట్టేశాడు ఓ వ్యక్తి. నవాజ్ షరీఫ్ను అమ్మకానికి పెట్టిన నెటిజన్కు ఆయన పరిపాలన నచ్చనట్టుంది. అందుకే, 'యూస్ లెస్ పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ ఫర్ సేల్' అంటూ ఆయన ఫొటోను పెట్టి మరీ 'ఈబే' లో ఒక ప్రకటన ఇచ్చాడు.
ఆ ప్రకటనలోని వివరాల గురించి చెప్పాలంటే... ఆయన ప్రాథమిక ధర 66,200 పౌండ్లను నిర్ణయించాడు. అంతేగాక, ఈ ప్రకటనలో ఇచ్చిన విస్తారమైన వివరణలో షరీఫ్ తీవ్రమైన విమర్శలతో ఏకీపారేశాడు.
'ఇప్పటికే వాడేసిన ప్రధాని షరీఫ్ను అమ్మేస్తున్నాం. ఇంక ఎంతమాత్రం మాకు అవసరం లేదు. ఈ అమ్మకం కోసం బాక్స్ గానీ, ఇన్స్ట్రక్చన్స్ గానీ ఇవ్వబడవు. కొనుగోలుదారుడే వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటెం అమ్మకందారుడు ఇంతవరకు టచ్ చేయలేదు. సెంట్రల్ లండన్ నుంచి ఐటెంను కలెక్ట్ చేసుకోవచ్చు. కొనుగోలు పూర్తికాగానే పూర్తి చిరునామా తెలియజేస్తాం. కొనుగోలుదారుడే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి అని ప్రకటనలో పేర్కొన్నాడు.
అంతటితో ఆగకుండా' ఈ ప్రొడక్ట్ లో, దీని కుటుంబంలో జన్యుపరంగా లోపమున్నది. అవినీతి భ్రష్టుపట్టినది. పని చేసే పరిస్థితిలో లేదు. ఎప్పుడూ పని చేయలేదు. పుట్టుకతోనే ఇది అవినీతితో లోపభూయిష్టమైనది. ఈ ప్రొడక్ట్ను కొంటే దీనిలాగే ఉండే షాబాష్ షరీఫ్(నవాజ్ షరీఫ్ సోదరుడు)ను ఉచితంగా ఇచ్చేస్తాం. భావోద్వేగమైన ఉపన్యాసాలతో, నాటకీయతతో మీకు మంచి వినోదాన్ని ఇది అందిస్తుంది' అంటూ ఆ ప్రకటనలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
కాగా, గతంలో కూడా ఇదే తరహాలో 'ఈ బే' లో ఒక ప్రకటన వచ్చింది. అయితే, నాటి ప్రకటనలో బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ను అమ్మివేస్తున్నామంటూ 65,900 పౌండ్లకు అమ్మకానికి పెట్టారు.