పాక్ సంచలనం: మూక దాడిలో ధ్వంసమైన హిందూ ఆలయాన్ని మళ్లీ కడతామన్న స్థానిక ప్రభుత్వం -భారత్ నిరసనతో
ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల ముస్లిం అతివాదులు దాడి చేసి, ధ్వంసం చేసిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ విధ్వంంసంపై భారత్ తీవ్ర నిరసన తెలపడంతో దాయాది దేశం దిగిరాక తప్పలేదు. అయితే, భారత్ లో బాబ్రీ మసీదు కూల్చివేతపై తుది తీర్పులను ఖండించిన పాకిస్తాన్.. అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఇండియా కంటే తానే మెరుగైన సెక్యులర్ దేశంగా బిల్డప్ ఇచ్చుకునేందుకు దీన్నొక అవకాశంగా వాడుకుంటోందనే వాదన వినిపిస్తోంది..
క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామ
అసలేం జరిగిందంటే..
పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని కరక్ జిల్లాలో గల తెరి గ్రామంలో కృష్ణ ద్వార మందిరంతోపాటు హిందూ మత గురువు పరమహంస జీ మహారాజ్ సమాధి ఉంది. దేశ విభజన కంటే ముందు నుంచే ఆ రెండూ పూజనీయ స్థలాలుగా కొనసాగుతున్నాయి. విభజన తర్వాత కృష్ణ మందిరం, మహారాజ్ సమాధులు హిందూ అతివాదులకు టార్గెట్ అయ్యాయి. ఆలయాన్ని పునరుద్ధరించేందుకు స్థానిక హిందూ సమాజానికి కోర్టులు, అధికారులు ఇటీవల అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మూకలు దాడికి దిగాయి. స్థానిక ఇస్లామిక్ మత పెద్దతోపాటు జమాతే ఉలేమా ఇస్లామ్ పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో పోగై బుధవారంనాడు ఆలయానికి నిప్పుపెట్టి, నిర్మాణాలను కూల్చేశారు. ఈ ఘటనపై..
భారత ప్రభుత్వం నిరసన..
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై పాకిస్తాన్కు భారత ప్రభుత్వం సూత్రప్రాయంగా తన నిరసన తెలియచేసింది. దీనిపై పాకిస్తాన్కు అధికారికంగా నిరసన తెలియచేసే ప్రక్రియ జరుగుతున్నట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలియచేశాయి. భారత్ నిరసన తెలిపిన కొద్ది గంటలకే ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. మూక దాడిలో ధ్వంసమైన ఆలయాన్ని స్థానిక ప్రభుత్వమే పునర్నిర్మిస్తుందని ఆయన తెలిపారు.
ఆలయ కూల్చివేతపై ఆగ్రహం..
అఖండ భారత్ కాస్తా, పాకిస్తాన్, ఇండియాగా విడిపోయిన తర్వాత.. పాక్ భూభాగంలోని వేలాది ఆలయాలు అధికారికంగానో, అనధికారికంగానో నేల మట్టం అయ్యాయి. అయితే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎంతో ప్రాముఖ్యమున్న కృష్ణ ద్వార మందిరం, పరమహంస జీ మహారాజ్ సమాధి విషయంలో మాత్రం పాక్ సర్కారు తీరు తొలి నుంచీ మరోలా కొనసాగుతున్నది. 1997లో ఈ సమాధిపై స్థానికులు దాడిచేయగా, సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వమే దీనిని పునర్నిర్మించింది. తాజా(2020, డిసెంబర్ 30నాటి) దాడిపైనా ప్రభుత్వం, కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంఘటన జరిగిన కొద్ది గంటలకే మొత్తం 26 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు..
మైనార్టీల రక్షణపై సుప్రీం విచారణ..
తెరి గ్రామంలో ఆలయంపై దాడి జరిగిన ఘటనను పాక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ సుమోటోగా విచారణకు స్వీకరించారు. పాకిస్తాన్ లోని హిందూ మైనార్టీల తరఫున పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తోన్న రమేశ్ కుమార్ గురువారం సీజేఐ గుల్జార్ ను కలిసి ఆలయ విధ్వంసంపై సమాచారం అందజేశారు. ఈ కేసును పాక్ సుప్రీంకోర్టు జనవరి 5 నంచి విచారించనుంది. హిందూ ఆలయంపై దాడిని పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రి నూరుల్ హఖ్ ఖాద్రి కూడా ఖండించారు. ఇది మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మైనారిటీల మత స్వేచ్ఛను పరిరక్షించడం తమ మత, రాజ్యాంగపర, నైతిక, జాతీయ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. కాగా,
ఆలయం పేరిట పాక్ పన్నాగం..
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో హిందూ ఆలయం, ప్రార్థనా స్థలంపై దాడి అంశంలో పాకిస్తాన్ రాజకీయ పోకడను ప్రదర్శిస్తోంది. మైనారిటీల మత స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత్ కంటే తానే ఛాంపియన్ అని చాటి చెప్పుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మోదీ హయాంలో భారత్ లోని ముస్లిం మైనార్టీల పట్ల వివక్ష పెరిగిందని ఆరోపిస్తోన్న పాకిస్తాన్.. అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పును కూడా ఖండించడం తెలిసిందే. ఇప్పుడు తన భూభాగంలోని హిందూ ఆలయం విధ్వంసానకి గురైతే, దాన్ని పునర్నిర్మించడం ద్వారా మైనార్టీల స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నట్లు బిల్డప్ ఇవ్వాలనుకుంటోంది. నిజానికి టెర్రరిస్టుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ లో రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు హిందూ ఆలయాలు టార్గెట్ అవుతున్నాయి. తెరి గ్రామంలో ఆలయాన్ని కూల్చిన జమాతే ఉలేమా ఇస్లామ్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రెండుగా చీలిపోయి, వర్గపోరులో పైచేయి కోసమే ఆలయంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం తెలివిగా ఈ ఘటనకు మైనార్టీల సంరక్షణ కోట్ వేసి చూపించాలనుకుంటోంది..
బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు