బ్లాక్ లిస్ట్ లో పాకిస్తాన్: ఆసియా పసిఫిక్ దేశాల కూటమిలో ఇక ఒంటరి?
ఇస్లామాబాద్: మన పొరుగుదేశం పాకిస్తాన్ ఆసియా పసిఫిక్ దేశాల కూటమిలో ఇక ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఆసియా పసిఫిక్ కూటమి దేశాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తోన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్).. పాకిస్తాన్ నిషేధించింది. ఆ దేశాన్ని బ్లాక్ లిస్ట్ లో ఉంచింది. ఆసియా పసిఫిక్ దేశాలతో దాదాపుగా ఆర్థిక సంబంధాలన్నింటినీ కోల్పోవడానికి ఈ నిషేధం కేంద్రబిందువుగా మారవచ్చని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరో జీవి ఉనికి బహిర్గతం? అంతరిక్షం నుంచి అంతుచిక్కని సంకేతాలు: షాక్ లో శాస్త్రవేత్తలు!
పాక్ ఆర్థికం..మరింత కకావికలం..
ఇప్పటికే ఆర్థిక ఊబిలో కూరుకునిపోయిన పాకిస్తాన్ కు తాజా నిషేధం.. మరింత కుంగదీయడం ఖాయమని అంటున్నారు. ఆసియా పసిఫిక్ దేశాలు అనుసరించే ఆర్థిక క్రమ శిక్షణను ఈ ఎఫ్ఏటీఎఫ్ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. దీనికోసం ఆ సంస్థ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలకు లోబడే ఆసియా పసిఫిక్ పరిధిలోని అన్ని దేశాలు తమ కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుంది. మనీ ల్యాండరింగ్, హవాలా ఉదంతాలు మొదలుకుని.. ఆర్థిక వనరులను దుర్వినియోగం చేయడం వంటి అంశాలన్నింటిపైనా ఎఫ్ఏటీఎఫ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. దీనికి సంబంధమైన హెచ్చరికలను ఆయా దేశాలకు జారీ చేస్తుంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
ఎఫ్ఏటీఎఫ్ కు భారత్ ఫిర్యాదు
ప్రత్యేకించి పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడుల అనంతరం ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. భారత విదేశాంగ, ఆర్థిక మంత్రిత్వశాఖలు సైతం ఈ విషయాన్ని ఎఫ్ఏటీఎఫ్ దృష్టికి తీసుకెళ్లాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద ప్రోత్సహ చర్యలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే పుల్వామా ఉగ్రవాదుల దాడి చోటు చేసుకుందని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశాయి. దీనికి గల సాక్ష్యాధారాలను అందజేశాయి. పాకిస్తాన్ లో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు విస్తృతంగా చోటు చేసుకోవడం, దాన్ని నియంత్రించడానికి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు దేశాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
అరెస్టులకు దిగినా.. చేయి దాటిన పరిస్థితి..
దీన్ని దృష్టిలో ఉంచుకుని జైషె మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ- జైషె మహమ్మద్ సహా పలు ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఎఫ్ఏటీఎఫ్ నిర్దారించింది. ఈ తరహా చర్యలను వెంటనే నిలిపివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ ఏడాది జూన్ లోనే ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరికలను జారీ చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచింది. అయినప్పటికీ- పాకిస్తాన్ వైఖరిలో మార్పేమీ రాలేదని ఎఫ్ఏటీఎఫ్ నిర్ధారణకు వచ్చింది. ఆ దేశాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్లు ప్రకటించింది. ఇదివరకు గ్రే లిస్ట్ లో ఉన్న పాకిస్తాన్ పేరును బ్లాక్ లిస్ట్ లోకి చేర్చుతున్నట్లు వెల్లడించింది.