ఆశ్చర్యం: 'రైల్వేమంత్రితో కలిసి పని చేయలేను, 730 రోజులు లీవ్ కావాలి'
కరాచి: పాకిస్తాన్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రైల్వే శాఖ మంత్రి పైన కోపంతో ఓ ఉద్యోగి ఏకంగా రెండేళ్లకు పైగా సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనకు 730 రోజులు సెలవు కావాలని కోరిన ఈ దరఖాస్తు పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆయన అన్ని రోజులు సెలవు పెట్టడానికి కారణంగా కూడా ఆసక్తికరమే. రైల్వే శాఖ మంత్రిపై అసంతృప్తితో ఆయన సెలవు పెట్టడం గమనార్హం. సెలవు అడిగిన ఆ ఉద్యోగి పేరు మొహమ్మద్ హనీఫ్ గుల్. పాకిస్తాన్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్గా పని చేస్తున్నారు.
ఆయన తన సెలవు పత్రంలో ఇలా పేర్కొన్నారు. రైల్వేశాఖ నూతన మంత్రి షేక్ రషీద్ అహ్మద్కు వృత్తి పట్ల నిబద్ధత లేదని, ఆయనకు రైల్వే మంత్రికి కావల్సిన నైపుణ్యాలు లేవని, పాకిస్థాన్ పౌరులకు సేవ చేసే వ్యక్తిగా నేను చెబుతున్నానని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని, కావు తనకు 730 రోజులు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు.
ఆ ఉద్యోగి హనీఫ్ గుల్ గ్రేడ్ 20 ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఈ లేఖను ఆగస్ట్ 20వ తేదీన రాశారు. తనకు 730 రోజులు సెలవులు ఇవ్వాలని, అలాగే పూర్తి వేతనం ఇవ్వాలని కూడా అభ్యర్థించాడు. దీనిపై నెటిజన్లు ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.