భారత్ తో యుద్ధానికి ముహూర్తం పెట్టేశాం..ఓడిపోయే ప్రసక్తే లేదు: రైల్వేమంత్రి ప్రేలాపన
రావల్పిండి: పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోందా? కార్గిల్ సహా ఇప్పటికి మూడుసార్లు మనదేశంతో యుద్ధానికి తలపడి తోక ముడిచిన పొరుగు దేశం.. మరోసారి అదే దుస్సాహసానికి పూనుకుంటోందా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్. భారత్ తో యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో యుద్ధం చేసి తీరుతామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, ఈ సారి ఓడిపోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ను మట్టికరిపించాలనే ఉద్దేశంతో పకడ్బందీగా అంతర్జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నట్లు తెలిపారు. భారత్ కు పరాభవం తప్పదని చెప్పారు.
కలకలం: ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించిన ఐపీఎస్ అధికారి
ఉపఖండం రూపురేఖలు మార్చేస్తాం..
రావల్పిండిలో బుధవారం ఏర్పాటైన ఓ ర్యాలీ, బహిరంగ ప్రదర్శనలో షేక్ రషీద్ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై తాము ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మద్దతును కూడగట్టుకుంటున్నామని అన్నారు. భారత్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. తాను అండగా ఉంటానని చైనా ఇప్పటికే వెల్లడించిందని చెప్పారు. ఆజాద్ కాశ్మీర్ (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) జోలికి వస్తే.. భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేస్తామని షేక్ రషీద్ అన్నారు. భారత్ సహా ఆసియా ఉపఖండంలో తమను వ్యతిరేకించే దేశాలకు సైతం ఈ యుద్ధం ద్వారా బుద్ధి చెబుతామని, తమను హేళన చేసే దేశాలకు ముప్పు తప్పదని అన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోన్న దేశంగా ముద్ర వేసి వారికి తమ సత్తా ఏమిటో, శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియజేస్తామని చెప్పారు.
ఇక ఇదే చివరి యుద్ధం..
భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగే చివరి యుద్ధం అక్టోబర్ లేదా నవంబర్ లో రావడం సహజసిద్ధమైన ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. భారత్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొంచే ప్రసక్తే లేదని, తమ సైనిక సత్తా ఏమిటో రుచి చూపిస్తామని అన్నారు. ఈ రెండు దేశాలకు ఇదే చివరి యుద్ధం అవుతుందని అన్నారు. ఈ యుద్ధం తరువాత పాకిస్తాన్ అత్యంత శక్తిమంత దేశంగా ఆవిర్భవిస్తుందని రషీద్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వివాదానికి భారత్ తెర తీసిందని అన్నారు. దీన్ని పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి సైతం విఫలమైందని చెప్పారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే విషయంలో భారత్ పై ఒత్తిడిని తీసుకుని రావడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించిందని విమర్శించారు.
ఆర్టికల్ 370 రద్దు తరువాత వేగంగా మారిన పరిణామాలు
ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ను విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన అనంతరం పాకిస్తాన్ లో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఇదే అంశంపై పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎదురు దెబ్బ సైతం తగిలింది. ఆర్టికల్ 370 రద్దు అంశంపై తన మిత్రదేశం చైనా సహకారంతో భద్రతా మండలిలో ప్రతిపాదించి.. చేతులు కాల్చుకుంది. భద్రతా మండలిలోని మెజారిటీ సభ్యులు భారత్ వైపే మొగ్గు చూపడంతో ఈ విషయంలో చైనా సైతం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) ఉపాధ్యక్షుడు గ్జు క్విలాంగ్ పాకిస్తాన్ లో పర్యటించి వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే షేక్ రషీద్ భారత్ యుద్ధం గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.
చైనా చక్రం తిప్పుతోందా?
ఇదివరకే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ చైనా పర్యటనకు వెళ్లడం, సరిహద్దుల్లో పెద్ద ఎత్తున స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బలగాలను పాకిస్తాన్ మోహరింపజేయడం వంటి అంశాలు యుద్ధానికే దారి తీసేలా కనిపిస్తున్నాయంటూ వస్తోన్న వార్తలకు షేక్ రషీద్ చేసిన ప్రకటన మరింత బలాన్ని ఇస్తున్నట్టయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ ను యుద్ధానికి ప్రేరేపించేలా చైనా ప్రవర్తిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధానికి దిగడమంటూ జరిగితే.. దాని వెనుక చైనా పరోక్ష సహకారం ఉండటం ఖాయమని తేల్చి చెబుతున్నారు. లడక్ పై కన్నేసిన చైనా.. ఆ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ ను అధికారికంగా ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ కు సహకరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.