దుస్సాహసం: మరో 2 బోట్లలో ఉగ్రవాదులు, మావి కాదని పాక్
లాహోర్/ఢిల్లీ: కరాచీ నుంచి మరో రెండు అనుమానాస్పద బోట్లు భారత జలాల్లోకి వచ్చాయి. వాటిని పోర్బందర్ తీరంలో కోస్ట్గార్డ్ అధికారులు గుర్తించారు. ఆ రెండు బోట్ల మధ్య జరిగిన అనుమానాస్పద రేడియో కమ్యూనికేషన్ను జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చి ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) అడ్డుకుని వింది. ఆ సమాచారాన్ని కోస్ట్గార్డ్కు అందించింది.
దాంతో, ఆ రెండు పడవలను పట్టుకునేందుకు కోస్ట్ గార్డ్ రెండు నౌకలను పంపించింది. వచ్చే వారంలో గుజరాత్లో ప్రవాసీ భారతీయ దివస్, వైబ్రెంట్ గుజరాత్ సదస్సులు జరగనున్నాయి. వీటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు విదేశీ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, తీరం వెంబడి నౌకలు, హెలికాప్టర్లు, విమానాలతో కోస్ట్ గార్డ్ నిఘాను తీవ్రతరం చేసింది. ఈసారి కూడా ఉగ్రవాదుల టార్గెట్ ముంబై నగరమేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
పాకిస్థానీ బోటు ఒకటి పేలుడు పదార్థాలతో కరాచీ నుంచి భారత జలాల్లోకి వచ్చి కోస్ట్గార్డ్ అడ్డుకోవడంతో పేల్చేసుకుందని వచ్చిన కథనాలను పాకిస్థాన్ ఖండించింది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీ మధ్య రాత్రి అసలు అటువంటి ఘటన ఏదీ జరగలేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తస్నిమ్ అస్లాం వ్యాఖ్యానించారు.
కరాచీ నుంచి అసలు పడవలేవీ సముద్రంలోకి వెళ్లనే లేదన్నారు. డిసెంబర్ 31వ తేదీన ఇద్దరు పాకిస్థానీ జవాన్లను భారత సైన్యం చంపేసిందని, దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని పాకిస్థాన్ రక్షణ శాఖ అధికారులు ఆరోపించారు.
కాగా, పాకిస్థాన్ నుంచి గుజరాత్ తీరానికి రెండు బోట్లు వచ్చాయా? ఒక బోటులోని ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నా మరో బోటు ఏమైంది? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ రెండో బోటు కోసం ఇప్పుడు కోస్ట్గార్డ్ అన్వేషణ తీవ్రతరం చేసింది. మొదటి బోటును చూసినప్పుడే రెండో బోటును కూడా కోస్ట్గార్డ్ అధికారులు చూశారు. అది కూడా కేతి బందర్ పోర్టు దిశగా వెళ్లినట్లు భావిస్తున్నారు.
భారత సముద్ర తీరంలోని చేపల బోట్లలో కలిసిపోయేందుకు రెండో బోటు ప్రయత్నించిందని భావిస్తున్నారు. కోస్ట్గార్డ్ దృష్టి నుంచి తప్పించుకోవడానికి రెండో బోటు ప్రయత్నించిందని, అయితే, అది ఎక్కడ ఉందనే విషయాన్ని కోస్ట్గార్డ్ విమానం పసిగట్టిందని, దాని ఆనుపానులపై దృష్టి సారించిందని వార్తలు వస్తున్నాయి.
దీనికి సంబంధించి మరో కథనం కూడా వినిపిస్తోంది. మొదటి బోటును కోస్ట్గార్డ్ అనుసరిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే రెండు బోట్లను పంపిన లష్కరే తాయిబా రెండో బోటును వెనక్కి వచ్చేయమని ఆదేశించిందని, దాంతో రెండో బోటు తిరిగి పాకిస్థానీ జలాల్లోకి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
తమను తాము పేల్చేసుకుని సముద్రంలో మునిగిపోయిన అనుమానాస్పద బోటు శకలాలు, అందులోని నలుగురి మృతదేహాల కోసం కోస్ట్గార్డ్ ముమ్మరంగా గాలిస్తున్నామని కోస్ట్ గార్డ్ కమాండర్ (వాయవ్య ప్రాంతం) కుల్దీప్ సింగ్ షెరాన్ తెలిపారు.
పాకిస్థాన్కు చెందిన ఆ బోటు భారత జలాల్లోకి ఎందుకు వచ్చింది? వాళ్లు మత్య్సకారులా? ఉగ్రవాదులా? అనే అంశంపై తుది నిర్ణయానికి రావడానికి దర్యాప్తు అధికారులకు ఈ సమాచారం కీలకంగా మారనుందన్నారు. సముద్రంలో మరో రెండు బోట్లు ఉన్నాయన్న సమాచారం తమకు లేదని షెరాన్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి పేల్చేసుకున్న బోటులోని వ్యక్తులు అసలు మత్య్సకారుల్లా కనిపించలేదని, ఆ బోటులో వలలు కూడా లేవని వివరించారు.