పాకిస్థాన్ దుస్సాహసం: జమ్మూకాశ్మీర్నూ తమ భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదల
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో దుస్సాహాసానికి పాల్పడింది. ఆగస్టు 5 నాటికి జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావస్తున్న వేళ.. పెను వివాదానికి తెరలేపింది. జమ్మూకాశ్మీర్ను కూడా తమ దేశ భూభాగాలుగా చూపిస్తూ కొత్త పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది.
పాక్ జాతీయుల ఆకాంక్ష అంటూ ఇమ్రాన్ ఖాన్..
పాకిస్థానీ జాతీయుల ఆకాంక్షలకు ప్రతిబింభంగా కొత్త మ్యాప్ ఉందంటూ ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ కొత్త మ్యాప్ వివరాలను పాఠశాల సిలబస్లో కూడా చేరుస్తామని విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వ్యాఖ్యానించాడు.
దురాక్రమిత కాశ్మీర్ అంటూ పాకిస్థాన్ పైత్యం..
కాగా, ఇప్పటి వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు గిల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతాలను తమ ప్రాంతాలుగా పేర్కొన్న పాక్.. ఇప్పుడు జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కూడా తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేసి తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది. భారత్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ కాదు.. భారత్ దురాక్రమిత జమ్మూకాశ్మీర్ అంటూ ఇటీవల పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఆగస్టు 5న బ్లాక్ డేగా పాక్.. పగటి కలలంటూ భారత నెటిజన్ల కౌంటర్
ఆగస్టు 5న అన్ని టీవీ, రేడియో ఛానళ్లు కూడా పాకిస్థాన్, ఏజేకే జాతీయ గీతాలను ప్రసారం చేయాలని, ఆ తర్వాత ఒక నిమిషంపాటు సైలెన్స్ పాటించాలని పాక్ సర్కారు పేర్కొంది. కాశ్మీర్లో భారత దారుణాలకు నిరసనగా టీవీ ప్రెజెంటర్స్ బ్లాక్ బ్యాండ్లు ధరించాలని, ఛానల్ లోగోస్ కూడా నలుపు రంగులో ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. కాగా, పాక్ కొత్త మ్యాప్పై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా భారత నెటిజన్లు పాక్కు కౌంటర్లు ఇస్తున్నారు. పాకిస్థాన్ పగటి కలలు కనడం మానుకోవాలని చురకలంటిస్తున్నారు.
Recommended Video
చైనా అండతో ఇటీవల నేపాల్ కూడా..
ఇది ఇలావుంటే, ఇటీవల నేపాల్ కూడా భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ ఓ కొత్త నేపాల్ మ్యాప్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. చైనా అండను చూసుకుని ఈ రెండు దేశాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే నేపాల్ చర్యపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూభాగాలను నేపాల్ పటంలో చూపడంపై నిరసన వ్యక్తం చేసింది. ఇది ఆమోదయోగ్యం కాదని చర్య అని గట్టిగా నేపాల్కు స్పష్టం చేసింది.