అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత ప్రయోగంపై పాక్ స్పందన..ఏమి చెప్పిందంటే..?
ఇస్లామాబాద్: అంతరిక్ష రంగంలో ఉపగ్రహాలను కూల్చివేయడానికి అవసరమైన క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించడంపై పాకిస్తాన్ స్పందించింది. అంతరిక్షంలో మిలటరీ చర్యలను పాక్ చేపట్టబోదని వెల్లడించింది. అంతరిక్షంలో ఉపగ్రహాలను కూల్చేలా క్షిపణిని తయారు చేసిన భారత్ ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన స్థానం దక్కించుకుంది.
అడ్డంగా దొరికేశారు: పాక్ కుట్ర బట్టబయలు..ఇవే రుజువులు
"అంతరిక్షం అనేది సృష్టిలో భాగం. అయితే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచదేశాలపై ఉంది. ఉపగ్రహాలను క్షిపణులతో కూల్చడం లాంటి మిలటరీ చర్యలకు దిగరాదు" అని పాక్ విదేశాంగ ప్రతినిధి మొహ్మద్ ఫైసల్ అన్నారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి అంతరిక్ష రంగంపై తీసుకొచ్చిన నిబంధనలను పాకిస్తాన్ తూచా తప్పక పాటిస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడి మళ్లీ గొప్పలు పోవడం సరికాదని అన్నారు పాక్ విదేశాంగా ప్రతినిధి మొహ్మద్ ఫైసల్ .
"గతంలో అంతరిక్షంలో ఉపగ్రహాలను కూల్చివేసిన ఘటనలో కొన్ని ప్రపంచదేశాలు ఈ చర్యలను గట్టిగా ఖండించాయి. ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో మరికొన్ని దేశాలు చేయకుండా అడ్డుకట్ట వేయాలి. అదే సమయంలో అంతరిక్షాన్ని పరిరక్షించుకోవాలి"అని మొహ్మద్ ఫైసల్ తెలిపాడు. ఇదిలా ఉంటే భారత్కు అంతరిక్ష రంగంలో మిలటరీ చర్యలకు దిగాలన్న ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైందని చెప్పిన విదేశాంగ శాఖ అంతరిక్షంలో ఆయుధాలు వినియోగించే ఉద్దేశం భారత్కు లేదని తేల్చి చెప్పింది.