ముంబై పేలుళ్ల నిందితుడికి పాక్ కోర్టు బెయిల్, టెక్నికల్ తప్పని పాక్
లాహోర్: పాకిస్తాన్ ద్వంద వైఖరి మరోసారి బయటపడింది! 26/11 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. ఈ దాడుల కేసులో నిందితుడు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్తాన్లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది.
ఆరేళ్ల క్రితం.. నవంబర్ 26, 2008లో లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్మాదంతో ముంబైపై చేసిన దాడుల్లో 166 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడులకు సూత్రధారి లష్కరే తాయిబా సీనియర్ కమాండర్ అయిన జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ప్రస్తుతం పాకిస్థాన్లోని రావల్పిండి జైల్లో ఉన్నాడు.
ఇతనికి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 26/11 ఘటనకు సంబంధించిన కేసును త్వరగా విచారించి నిందితులకు శిక్ష ఖరారు చేయాలని ఓ వైపు పాకిస్తాన్ను కోరుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిందితుడికి బెయిల్ మంజూరు కావడం గమనార్హం.
పాకిస్తాన్ తాలిబన్లు పెషావర్లో రెండు రోజుల క్రితం సాగించిన మారణహోమం తెలిసిందే. పాఠశాలలోకి చొరబడి అభంశుభం తెలియని 142 మంది చిన్నారులను, తొమ్మిది మంది సిబ్బందిని కాల్చివేశారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. అంతేకాదు, పాకిస్తాన్ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పింది. తీవ్రవాదం పైన ఉక్కపాదం మోపుదామని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది.
ఆ బెయిల్ సాంకేతిక లోపం: పాకిస్తాన్
26/11 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అతనితో పాటు ఇదే కేసుకు సంబంధించి మరో ఆరుగురు నిందితులు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే లఖ్వీకి బెయిల్ ఇవ్వడంపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఇది టెక్నికల్ ఎర్రర్ అని పేర్కొంది.
తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని అధికారులు తెలిపారు. బుధవారం న్యాయస్ధానంలో వాదనలు జరగలేదని, లాయర్లు సమ్మె చేస్తుండటంతో పాటు పెషావర్ దుర్ఘటన కారణంగా ఈ అంశం పైన ఎవరు దృష్టి పెట్టలేకపోయారని ప్రభుత్వం పేర్కొంది. లఖ్వీకి బెయిల్ మంజూరైందని కానీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, పైగా ఇది సరైన సమయం కాదని భావిస్తున్నామని పాకిస్తాన్ ప్రముఖ వార్తా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.