మోడీ ఉగ్రవాది! అదో ఉగ్రపార్టీ!!: పాక్, గట్టి కౌంటర్ ఇచ్చిన బీజేపీ
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ దేశం భారత్పై అక్కసు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక 'ఉగ్రవాది' అని, భారత ప్రభుత్వాన్ని ఓ 'ఉగ్రవాద పార్టీ'నే నడుపుతోందంటూ.. పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించిన భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మ స్వరాజ్.. 'ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఎగుమతి చేస్తోంది'అంటూ ఆ దేశం తీరును ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్లో ఓ టీవీ ఛానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనిపై ఖ్వాజా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, పాక్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. 'ఉగ్రసంస్థలకు మోకరిల్లుతున్న పాక్ ప్రభుత్వంలో.. ఖ్వాజా ఓ రాజకీయ అల్పుడు. దౌత్యవిజయాల ద్వారా మోడీ ప్రపంచం ముందు పాక్ నిజస్వరూపాన్ని బట్టబయలుచేస్తుంటే.. పాలుపోని స్థితిలో ఆ దేశం ఇలాంటి పిరికి వ్యాఖ్యలకు దిగుతోంది' అని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.
పాక్ అధికార పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ షరీఫ్
పాక్ ప్రధానిగా కొద్ది నెలల క్రితం అనర్హత వేటుకు గురైన నవాజ్ షరీఫ్ అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడిగా మంగళవారం మళ్లీ ఎన్నికయ్యారు. వెంటనే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు.
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం నవాజ్ షరీఫ్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తనను ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన అనర్హత వెనుక కారణాలు పార్టీ కార్యకర్తలకు తెలుసని పేర్కొన్నారు.కాగా, పనామా పత్రాల కుంభకోణంలో - పాక్ సుప్రీంకోర్టు జులైలో షరీఫ్ను ప్రధానిగా అనర్హులని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. పీఎంఎల్-ఎన్ తన శక్తిని ఉపయోగించి సోమవారం వివాదాస్పద ఎన్నికల చట్టాన్ని (2017) తీసుకొచ్చినట్లు ఓ పాక్ పత్రిక వెల్లడించింది. 1976 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు పడిన వ్యక్తి పార్టీకి అధ్యక్షుడు కాలేరు. కానీ తాజా చట్టం ద్వారా దానికి వీలు కల్పిస్తూ.. నవాజ్ షరీఫ్ను అధ్యక్షుడిని చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది.