హద్దు దాటలేదు, ఆ హెలికాప్టర్లో పీఓకే ప్రధాని: పాక్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ఆదివారం పాకిస్థాన్కు చెందిన ఓ హెలికాప్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, భారత జవాన్లు సదరు హెలికాప్టర్పై స్వల్పంగా కాల్పులు జరపడంతో వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
భారత గగనతలంలోకి పాకిస్తాన్ హెలికాప్టర్, పేల్చేసే ప్రయత్నం చేసిన ఆర్మీ (వీడియో)
కాగా, ఆ హెలికాప్టర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని రజా ఫరూఖ్ హైదర్ ఖాన్ ఉన్నట్లు పాకిస్థాన్ మీడియా సంస్థ ఆజ్ న్యూస్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పీఓకే ప్రధాని ఫరూఖ్ హైదర్ ఖాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తరోరీ ప్రాంతంలో ల్యాండ్ అవుతుండగా భారత ఆర్మీ కాల్పులు జరిపిందని ఆజ్ న్యూస్ తెలిపింది. అయితే, తాము భారత భూభాగంలోకి రాలేదని పాక్ చెబుతోంది.
ఆదివారం మధ్యాహ్నం 12.13గంటల ప్రాంతంలో పూంఛ్ జిల్లాలోని గుల్పూర్ సెక్టార్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ హెలికాప్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించింది. అప్రమత్తంగా ఉన్న వాయు గస్తీ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది. దీంతో ఆ హెలికాప్టర్ వెంటనే అక్కడ్నుంచి వెనక్కి వెళ్లిపోయింది.
ఈ ఘటన భారత్, పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, ఈ ఘటనపై స్పందించని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆ హెలికాప్టర్లో ఎలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. అయితే, ఈ హెలికాప్టర్ ఉద్దేశపూర్వకంగా వచ్చిందా? లేక పొరపాటున వచ్చిందా అన్న విషయంపై స్పష్టత రాలేదు. నావిగేషన్ సమస్య వల్ల అనుకోకుండా బార్డర్ దాటి ఉండవచ్చని మేజర్ జనరల్(రిటైర్డ్) అశ్వనీ సివాచ్ అభిప్రాయపడ్డారు.