భారత హైకమిషన్ అధికారులపై పాక్ మరో కుట్ర.. ప్రతీకార చర్యేనా..?
పాకిస్తాన్లోని భారత హై కమిషన్ సిబ్బందిని ఇరికించేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. గూఢచర్యం ఆరోపణలతో మొదట వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసినా.. పాకిస్తాన్ మీడియా మాత్రం హిట్&రన్ కేసు అంటూ కథనాలు ప్రసారం చేసింది. భారత్ గట్టిగా నిరసన తెలపడంతో చివరకు పాకిస్తాన్ దిగి రాక తప్పలేదు. ఆ ఇద్దరు అధికారులను విడిచిపెట్టినప్పటికీ.. వారిపై మరో కొత్త కుట్రకు తెర లేపింది. ఆ ఇద్దరి వద్ద ఫేక్ కరెన్సీ గుర్తించామని.. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించింది.
పాకిస్తాన్ విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో రెండు బ్యాగులు స్వాధీనం..ఏముందో తెలుసా?
పాక్ ఏం చెబుతోంది...
భారత్కు చెందిన ఆ ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్ద పీకేఆర్ 10,000 విలువ(రూ.4619) చేసే ఫేక్ కరెన్సీని గుర్తించినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్కు చెందిన అనస్ మాలిక్ అనే ఓ జర్నలిస్ట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే దౌత్యపరంగా వారికి ఉన్న ప్రత్యేక అధికారాల కారణంగా వారిని పాక్ విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు. అయితే పాక్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. విచారణ పేరుతో వారిని 12 గంటల పాటు నిర్బంధంలో ఉంచడాన్ని వ్యతిరేకించింది. వెంటనే వారిని విడుదల చేయాలని,వారి కారుతో పాటు ఆ ఇద్దరిని భారత హైకమిషన్ కార్యాలయానికి పంపించాలని పాకిస్తాన్ చార్జ్ డి అఫైర్స్ సయ్యద్ హైదర్ షాకు భారత విదేశాంగ నోటీసులు పంపింది.
ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నారు..
అరెస్ట్ అయిన ఆ ఇద్దరు అధికారులు భారత హైకమిషన్ కార్యాలయంలో సీఐఎస్ఎఫ్ డ్రైవర్స్ అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం ఎప్పటిలాగే విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా పాకిస్తాన్ ఐఎస్ఐ సిబ్బంది వారి కార్లను వెంబడించి పట్టుకున్నట్టు తెలిపింది. ప్రత్యక్ష సాక్షి ఒకరు దీనిపై మాట్లాడుతూ... తాను మార్నింగ్ వాక్కి వెళ్లినప్పుడు ఉదయం 8గం. సమయంలో ఆ కారు ఒకచోట ఆగి ఉందని,కొంతమంది గుంపు తాను చుట్టూ చేరడాన్ని గమనించానని చెప్పారు.
హిట్&రన్ కేసు..
పాకిస్తాన్ మీడియా మాత్రం హిట్&రన్ కేసులోనే వారిని అరెస్ట్ చేసినట్టు కథనాలు ప్రసారం చేసింది. కారులో వెళ్తున్న సమయంలో ఓ పాదచారుడిని ఢీకొట్టి,అతన్ని గాయపరిచినందుకు భారత హైకమిషన్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్టు తెలిపింది. అయితే విచారణ పేరుతో హైకమిషన్ అధికారులను పాక్ చిత్రహింసలకు గురిచేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరు అధికారులపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే యాక్సిడెంట్ చేసినందున.. స్థానికులు వారిపై దాడి చేయడం వల్లే గాయాలయ్యాయని పాక్ అధికారులు చెబుతుండటం గమనార్హం.
Recommended Video
ప్రతీకార చర్యేనా..
గత కొద్ది వారాల క్రితం ఇద్దరు పాకిస్తాన్ హైకమిషన్ అధికారులను గూఢచర్యం ఆరోపణలతో భారత్ బహిష్కరించింది. భారత ఆర్మీ ట్రూప్స్కి సంబంధించిన కదలికలపై కొన్ని డాక్యుమెంట్స్ను వారి వద్ద గుర్తించినట్టు భారత్ తెలిపింది. అప్పటినుంచి పాకిస్తాన్.. ఇస్లామాబాద్లోని భారత్ హైకమిషన్ అధికారులను వేధిస్తోంది. భారత దౌత్యవేత్త గౌరవ్ అహుల్ వాల్యాను ఇటీవల కొంతమంది వెంబడిస్తున్నట్టు ఓ వీడియో వెలుగుచూసింది. ఆయన నివాసం వెలుపల కూడా కొంతమంది గుంపుగా చేరడం కలకలం రేపింది. తాజాగా సీఐఎస్ఎఫ్ డ్రైవర్లపై తప్పుడు కేసులు మోపి ఇరికించాలని కుట్ర చేసింది. నిజానికి జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచే పాక్ ప్రతీకారంతో రగిలిపోతోంది. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతీసారి భారత్పై విషం కక్కుతూనే ఉంది.