లాడెన్పై వ్యాఖ్యలు: మాజీ మంత్రి వివరణ కోరిన పాక్
న్యూఢిల్లీ: ఆల్ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్లోనే ఉన్న సంగతి తమకు తెలుసునని, ఆయనకు ఆశ్రయం ఇచ్చింది తామేనని పాకిస్థాన్ రక్షణ శాఖ మాజీ మంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
ముక్తార్ ఇటీవల భారత్కు చెందిన న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్-ఐబీఎన్కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ ముక్తార్ వ్యాఖ్యలతో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరిఫ్లతో పాటు అధికారులు సైతం నిర్ఘాంతపోయారు.
2011 మేలో అమెరికా దాడులు చేసిన ఆల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను చంపడానికి ముందు లాడెన్ పాకిస్థాన్లోనే ఉన్నాడని, అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, మాజీ ఆర్మీ చఫ్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ, ఇతర అధికారులుక తెలుసునని అహ్మద్ ఇంటర్యూలో వెల్లడించారు.
పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. పాకిస్థాన్ అంతర్గత భద్రత శాఖ మాజీ మంత్రి రెహమాన్ మాలిక్, పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్, రషీద్ ఖురేషిలు అహ్మద్ ముక్తార్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఖండించారు.
అహ్మద్ అబద్ధాల కోరని, ఆయన చెబుతున్నవి నిజం కాదని వారు వ్యాఖ్యానించారు. నిజంగానే లాడెన్ ఎక్కడున్నాడో పాకిస్థాన్కు తెలియదని చెప్పారు. అహ్మద్ ముక్తార్ 2008 నుంచి 2012 వరకు పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇప్పటివరకూ అబోటాబాద్లో బిన్ లాడెన్ ఉన్నట్టు తమకు తెలియదని, తమ ప్రమేయం లేకుండానే అమెరికా దాడులు జరిపి ఆయన్ను హతమార్చిందని ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చిన పాకిస్థాన్, అహ్మద్ ముక్తార్ వ్యాఖ్యలతో ఖంగుతింది.