మారని పాక్.. భారత్ను విలన్గా చూపించేందుకు కొత్త కుట్రలు... నయా ఎజెండాతో...
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఈ అగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతుంది. భారత భూభాగంలో అంతర్భాగమైన కశ్మీర్ పట్ల భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. కశ్మీర్ విషయంలో భారత్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దుకి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అగస్టు 5వ తేదీన భారత్ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఇప్పటికే ఎజెండా రూపొందించారు.
Recommended Video
'బ్లాక్ డే-అగస్టు 5' పేరుతో
'బ్లాక్ డే-అగస్టు 5' పేరుతో ఇమ్రాన్ ఖాన్ 18 పాయింట్లతో కూడిన ఎజెండాను రూపొందించారు. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇమ్రాన్ పర్యటించనున్నారు. అక్కడ కశ్మీర్ అంశంపై ఇమ్రాన్ ఇవ్వనున్న ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఇమ్రాన్ ప్రసంగం కంటే ముందు విదేశీ జర్నలిస్టులను కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్కు తీసుకెళ్తారు. గతంలో లాగే ఈసారి కూడా అక్కడి ఉగ్రవాద శిబిరాలకు దూరంగానే జర్నలిస్టుల టూర్ కొనసాగుతుంది.
ఇదీ ఎజెండా...
అగస్టు 5 ఎజెండాలో భాగంగా కశ్మీర్ విషయంలో భారత్ను ప్రపంచానికి విలన్గా చూపించేలా పాకిస్తాన్ పలు కథనాలు,డాక్యుమెంటరీలు,స్టేట్మంట్స్ విడుదల చేయనుంది. దాదాపుగా అక్కడి అన్ని ప్రధాన పత్రికల్లోనూ భారత్కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించేందుకు ప్లాన్ చేసింది. 'కశ్మీరీల పట్ల భారత్ క్రూరత్వం' పేరుతో ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఒక స్టేట్మెంట్ను కూడా విడుదల చేయనున్నారు. అందులో కష్టకాలంలో కశ్మీరీలకు పాకిస్తాన్ ఎలా అండగా నిలిచింది వివరించబోతున్నారట.అంతేకాదు,అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ద్వారా భారత్కు వ్యతిరేకంగా ట్వీట్లు కూడా చేయించాలని ప్రయత్నిస్తోంది. అలాగే మలేషియా ప్రధాని,టర్కీ అధ్యక్షుడి ద్వారా పాక్ వాదనకు మద్దతుగా భారత్కు వ్యతిరేకంగా ట్వీట్లు చేయించాలని ప్లాన్ చేసింది.
మారని పాక్ వైఖరి...
కశ్మీర్ భారత అంతర్భాగమని,ఇందులో మరో దేశ జోక్యానికి తావు లేదని భారత్ ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ తీరులో మాత్రం మార్పు రావట్లేదు. గతంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనూ ఇమ్రాన్ ఖాన్ దీనిపై ఆవేశపూరిత ప్రసంగం చేశారు. కశ్మీర్లో ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతం తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ యుద్ధమంటూ వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, చివరి వరకు పోరాడతామని అన్నారు. అణ్వస్త్రాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదన్నారు. కశ్మీర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించి ఇమ్రాన్ వైఫల్యం చెందారు. కేవలం టర్కీ మినహా ఏ దేశం భారత్కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసించలేదు.కశ్మీర్ విషయంలో పాక్ మిత్ర దేశం చైనా కూడా తటస్థ వైఖరినే అవలంభించింది.
అప్పుడు.. ఇప్పుడు.. భారత్ ఒకే స్టాండ్...
ప్రస్తుతం చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు,ఎన్నడూ లేనిది అటు నేపాల్ కూడా దురాక్రమణ వ్యూహాలకు తెరలేపడం... ఇలాంటి తరుణంలో ఇటు కశ్మీర్ విషయాన్ని మరోసారి తెర పైకి తీసుకొచ్చి భారత్ను బద్నాం చేసేందుకు పాక్ కుయుక్తులకు పాల్పడుతోంది. అయితే పాక్ ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా... భారత్ మొదటి నుంచి హుందా వైఖరితోనే వ్యవహరిస్తోంది. కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యానికి తావు లేదని స్పష్టం చేస్తూ వస్తోంది.