చైనాకు షాక్..బలూచిస్తాన్లో సీన్ రివర్స్.. పాక్ స్టాక్ ఎక్సేంజ్పై దాడి బీఎల్ఏ పనే.. భారత్ ప్రమేయం?
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్టాక్ ఎక్సేంజ్ భవంతిపై సోమవారం జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి తమ పనేనంటూ 'బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)' ప్రకటన చేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)లో భాగంగా చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో కీలకమైనవి బలూచిస్తాన్ లోనే ఉండటం, ఇప్పటికే టెర్రరిస్టులతో చైనా లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో తాజా దాడి డ్రాగన్ కు హెచ్చరిక లాంటిదేనని స్పష్టమైంది.
Recommended Video
చైనా భుజం మీదుగా జగన్ పైకి తూటా.. మోదీ సారథ్యానికి రఘురామ జేజేలు.. ఎంపీ అనూహ్య చర్య..
నెత్తురోడిన స్టాక్ ఎక్సేంజ్..
20 ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తోన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. సీపెక్ పేరుతో చైనా ఎంటరైన తర్వాత తన కార్యకలాపాలను చాలా వరకు తగ్గించుకుంది. మధ్యలో 2018లో ఓసారి చైనా కాన్సులేట్ పై దాడికి పాల్పడింది. మళ్లీ ఇప్పుడు కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే మళ్లీ దాడులకు తెగబడి అందర్నీ ఆశ్చర్యపర్చింది. చైనా నుంచి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజ్ మళ్లీ పుంజుకుంటున్న తరుణంలోనే బీఎల్ఏ ఘాతుకానికి పాల్పడింది. దాడి తర్వాత చైనాను హెచ్చరిస్తూ బీఎల్ఏ సమర్థకులు పోస్టులు కూడా పెట్టడం గమనార్హం. సోమవారం నాటి దాడిలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు సాధారణ పౌరులు, నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఒక పోలీసు, నలుగురు టెర్రరిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
షాకింగ్: స్టాక్ ఎక్సేంజ్పై ఉగ్రదాడి.. గ్రెనేడ్లు, తుపాకులతో టెర్రరిస్టుల బీభత్సం.. కరాచీలో టెర్రర్
టెర్రరిస్టులతో చైనా ఒప్పందం..
చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) భద్రత విషయంలో చైనా ప్రభుత్వం పలు ఉగ్రవాద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రఖ్యాత ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికలో వెల్లడైంది. ప్రధానంగా బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతోన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)తో చైనా కంపెనీలు నేరుగా సంప్రదింపులు జరపడం, సీపెక్ లో భాగంగా ఉన్న ప్రాజెక్ట్లపై దాడులు చేయవద్దని వేడుకోవడం, అందుకు ప్రతిఫలంగా భారీగా తాయిలాలను కూడా సమర్పించుకున్నట్లు సాక్ష్యాత్తూ పాక్ అధికారులే గతంలో ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే బీఎల్ఏ పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజ్ భవంతిపై దాడికి పాల్పడటం ద్వారా చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపినట్లయింది.
రోడ్డెక్కిన విద్యార్థులు..
బలూచిస్తాన్ లో గడిచిన వారం రోజులుగా విద్యార్థులు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్న సమయంలోనే అదే ప్రాంతానికి చెందిన ఉగ్రవాదులు కరాచీలో దాడులకు పాల్పడటం గమనార్హం. కరోనా కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని స్థాయిల క్లాసులను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నది. అయితే, బలూచిస్తాన్ లో సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన ‘‘డిజిటల్ పాకిస్తాన్'' ఏమైందంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనిపై సర్కారు ఇప్పటిదాకా స్పందించలేదు. ఇదిలా ఉంటే..
ఇండియాపై అవాకులు..
విస్తీర్ణం పరంగా పాకిస్తాన్ లో అతిపెద్ద ఫ్రావిన్స్(రాష్ట్రం) అయినప్పటికీ బలూచిస్తాన్ లో జీవన ప్రమాణాలు దారుణంగా ఉంటాయి. పాక్ సర్కారు తీరుతో విసిగిపోయిన గిరిజన తెగలు దశాబ్దాల కిందటే ప్రత్యేక దేశం కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో భారీగా చేపట్టిన దాడులతో ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)' వెలుగులోకి వచ్చింది. అక్కడి వేర్పాటువాద ఉద్యమానికి ఇండియా అన్ని రకాలుగా సహకరిస్తోందని, బీఎల్ఏ కీలక నేతలు తరచూ ఇండియాకు వెళ్తుంటారని పాక్ నేతలు తరచూ ఆరోపిస్తుంటారు. వీటని భారత ప్రభుత్వం ఖండిస్తూ వచ్చింది. అయితే పాక్ గడ్డపైకి చైనా అడుగుపెట్టిన తర్వాత అక్కడి రాజకీయాలు దాదాపుగా మారిపోయాయి..