సర్జికల్ స్ట్రైక్స్: బాలాకోట్లోకి మీడియాను ఎందుకు రానివ్వట్లేదు, అక్కడ అసలేం జరుగుతోంది?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్ ప్రాంతంలో జైష్ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసింది. తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ నమ్మించే ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ దాడి అనంతరం 250 నుంచి 350 సెల్ఫోన్ల వరకు మూగబోయాయి. దీంతోనే దాడి వల్ల వందలాది మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
ఐఏఎఫ్ దాడి వల్ల మాకు తీవ్రనష్టం, ఇమ్రాన్ భారత్కు తలొంచుతావా?: జైష్ చీఫ్ సోదరుడు
మీడియాను తీసుకెళ్తామని చెప్పింది కానీ..
బాలాకోట్ ప్రాంతంలో దాడులు జరిగినా తమకు ఎలాంటి నష్టం జరగలేదని, తాము నిజమే చెబుతున్నామని పాకిస్తాన్ పదేపదే చెబుతోంది. తాము చెప్పేది నిజమని రుజువు చేసేందుకు అక్కడకు అంతర్జాతీయ మీడియాను తీసుకు వెళ్తామని ఒకటికి రెండుసార్లు చెప్పింది. పాకిస్థాన్ సమాచారా శాఖ స్పందిస్తూ.. బాలాకోట్లోని మదర్సా (జైష్ ఎ మహ్మద్ క్యాంప్) ఉన్నచోటుకు మీడియాను తీసుకెళ్తామని తెలిపింది. కానీ రెండుసార్లు వాతావరణం అనుకూలించడంలేదని వాయిదా వేసింది. ఆ మదర్సా వద్ద జైష్ ఎ మహ్మద్ పేరుతో ఒక సైన్ బోర్డు కూడా ఉందని ఆ తర్వాత దానిని తొలగించారని స్థానికులు కూడా చెప్పారట. ఆ బోర్డుపై మసూద్ అజహర్ పేరు ఉందట.
బయటపడుతున్న పాక్ వైఖరి
భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్లో చెట్లు కూలాయని పాక్ చెప్పింది. ఈ మేరకు పాకిస్తాన్ అటవీ శాఖ కేసు కూడా పెట్టింది. దాడి జరిగిన రోజు నుంచి ఆ చెట్ల ఫొటోలు ఒక బాంబు అవశేషాల చిత్రాలు మాత్రమే ఇంటర్నెట్లో తిరుగుతున్నాయి. మిగిలిన చిత్రాలు ఏవీ బయటకు రాలేదు. భారత యుద్ధవిమానాలు పాకిస్తాన్లోకి వచ్చి ఏమీ చేయలేకపోయాయని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మీడియాను తీసుకెళ్తామని చెప్పీ, అలా చేయకపోవడంతో పాక్ వైఖరి బయటపడుతోందని అంటున్నారు.
రాయిటర్స్ కష్టపడి వెళ్లింది కానీ
ఇటీవల ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ రాయిటార్స్కు చెందిన విలేకర్ల బృందం కష్టపడి బాలాకోట్లోని జైష్ ఏ మహ్మద్ క్యాంప్ ఉన్న కొండపైకి చేరింది. తీరా అక్కడికి వెళ్లేసరికి ఆ ప్రాంతం మొత్తం పాకిస్తాన్ సాయుధ బలగాలతో నిండింది. పాక్ సైన్యం రాయిటార్స్ బృందాన్ని అక్కడకు వెళ్లనివ్వలేదు. దాదాపు వంద మీటర్ల దూరం నుంచి మాత్రమే ఫోటో తీసుకున్నది. కానీ ఈ ఫొటోతో ఎటువంటి అంచనాకు రాలేమని రాయిటార్స్ తెలిపింది. దాదాపు పది రోజులుగా పాకిస్తాన్ బలగాలు అక్కడే పాగావేశాయని చెబుతున్నారు. అసలు అక్కడ వారు ఏం చేస్తున్నారనేది బాహ్య ప్రపంచానికి తెలియడం లేదని అంటున్నారు. బాంబుదాడి జరిగింది ఇక్కడే అంటూ పాకిస్తాన్ ఒక అటవీ ప్రాంతాన్ని చూపింది. కానీ జైష్ ఏ మహ్మద్ క్యాంపుకు భద్రత దేనికని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, అక్కడ పని చేస్తున్న జవాన్లను కూడా ఫోన్లు ఇవ్వడం లేదట.