పాక్లో ఆత్మాహుతి దాడి: 18 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి మోటార్ సైకిల్పై వచ్చిన దుండగుడు ఆత్మాహుతి దాడి పాల్పడడంతో 18 మంది మృతిచెందారు. మార్దన్ ప్రాంతంలోని నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కార్యాలయం గేటు తోసుకుంటూ రద్దీగా ఉండే కార్యాలయంలోకి మోటార్సైకిల్పై దూసుకెళ్లి ఆత్మహుతి చేసుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, 25మందికి గాయాలయ్యాయి. కార్యాలయం గేటు వద్ద సెక్యురిటీ సిబ్బంది మోటార్ సైకిల్ను అడ్డుకొనేందుకు విఫలప్రయత్నం చేశారు. బైక్పై వచ్చిన వ్యక్తి బలవంతంగా లోపలికి దూసుకెళ్లాడని పోలీసులు వెల్లడించారు.
గేటుకు సమీపంలోనే పేలుడు సంభవించినట్లు చెప్పారు. పేలుడు ధాటికి భవనం కిటికీలు, తలుపులు పలుచోట్ల ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బాచ్ ఖాన్ మెడికల్ కాంప్లెక్స్లోకి 16 మృతదేహాలు, డజన్ల కొద్ది క్షతగాత్రులు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఆత్మాహుతి దాడిలో 18 మంది మరణించినట్లు పోలీసు సూపరింటిండెంట్ హస్మతుల్లా జైదీ చెప్పారు. సంఘటన జరిగిన మర్దాన్ పెషావర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దాడికి పాల్పడింది ఏ గ్రూప్ అనేది ఇంకా తెలియలేదు.