సంఝౌతా ఎక్స్ ప్రెస్ రద్దు: ఇంకా తెరచుకోని విమానాశ్రయాలు, బ్లాక్ అవుట్ లో పాక్
ఇస్లామాబాద్: సరిహద్దుల్లో రెండు రోజులుగా నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్ లను అనుసంధానిస్తూ రెండు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు సర్వీస్ ను రద్దు చేసింది. పాకిస్తాన్ లోని లాహోర్ నుంచి అట్టారీ స్టేషన్ మీదుగా దేశ రాజధాని న్యూఢిల్లీ మధ్య వారానికి రెండుసార్లు సోమ, గురువారాల్లో రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు ఇది.
నాలుగు ఏసీ కోచ్ లు సహా 22 బోగీలు ఉన్న ఈ రైలు గురువారం ఉదయం 8 గంటలకు లాహోర్ లో బయలుదేరాల్సి ఉంది. దీనికోసం 28 మంది ప్రయాణికులు టికెట్లను రిజర్వ్ కూడా చేసుకున్నారు. ఈ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు కొన్ని గంటల కిందటే పాకిస్తాన్ రైల్వే మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున రైలు సర్వీస్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ రైల్వేస్ అదనపు జనరల్ మేనేజర్ పేరు మీద ఈ ప్రకటన విడులైంది.
పాకిస్తాన్ రైల్వేకు చెందిన బోగీలను అట్టారీ స్టేషన్ లో నిలిపివేస్తారు. వాటి స్థానంలో మన రైలు బోగీలను అమర్చుతారు. ప్రయాణికులను ఈ బోగీల్లోకి బదలాయిస్తారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ఈ రైలు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. లాహోర్ స్టేషన్ లో నిలిచిపోయారు. వారికి ప్రత్యామ్నయ మార్గాల ద్వారా గమ్యస్థానాలను చేర్చుతామని అధికారులు తెలిపారు. వారిలో ఎవరూ నేరుగా న్యూఢిల్లీ దాకా ప్రయాణించే వారు లేరని తెలుస్తోంది.
దేశభక్తిని చాటుకున్న జంట .. పుట్టిన బిడ్డకు 'మిరాజ్' అని నామకరణం
1971లో పాకిస్తాన్ తో యుద్ధం ముగిసిన అనంతరం దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి రెండు దేశాలు ఈ రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీనికి సంబంధించిన ఒప్పందాలను సంతకాలు చేశారు. సిమ్లా ఒప్పందం ప్రకారం.. 1976 జులై 22వ తేదీన ఈ రైలు పట్టాలెక్కింది. రెండు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం.. ఈ రైలు నడుస్తున్నందున దీనికి సంఝౌతా అని నామకరణం చేశారు.
బ్లాక్ అవుట్ లోనే పాక్..
కాగా, భారత్ వైపు క్రమంగా పరిస్థితులు కుదుట పడుతున్నప్పటికీ.. పాకిస్తాన్ లో మాత్రం యుద్ధ ఛాయలు పూర్తిగా తొలగిపోలేదు. బుధవారం ఎయిర్ క్రాఫ్ట్ ల దాడి అనంతరం మూతపడిన పలు విమానాశ్రయాలు 24 గంటలు దాటుతున్నప్పటికీ తెరచుకోలేదు. భారత సరిహద్దులకు సమీపంలో ఉన్న ముల్తాన్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, సియాల్ కోట్ విమానాశ్రయాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా పునరుద్ధరించలేదు. విమానాల రాకపోకలపై బుధవారం నాడు విధించిన నిషేధం కొనసాగుతోంది. కరాచీలో విధించిన అత్యవసర ఉత్వర్వులు అమల్లోనే ఉన్నాయి. దీనితోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, నియంత్రణ రేఖ, గిలిగిట్-బాల్టిస్తాన్, లాహోర్ కంటోన్మెంట్, సియాల్ కోట్ కంటోన్మెంట్, కరాచీ కంటోన్మెంట్, పాస్నీ కోస్ట్ లైన్, ఒకారా కంటోన్మెంట్ ప్రాంతాల్లో విధించిన నిషేధ ఉత్తర్వులు మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.