మలాలాపై కాల్పులు జరిపిన ఉగ్రవాది హతం: అమెరికా మీడియా వర్గాల వెల్లడి
నోబెల్ శాంతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్పై కాల్పులు జరిపిన ఉగ్రవాది మౌలానా ఫజుల్లా హతమైనట్లు అమెరికా దళాలు వెల్లడించాయి. అఫ్ఘానిస్తాన్ తూర్పు కునార్ ప్రావిన్స్లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడిలో ఈ తాలిబన్ చీఫ్ హతమైనట్లు అమెరికా మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
పేరొందిన ఉగ్రవాదులే టార్గెట్గా డ్రోన్లతో దాడులు చేసిన అమెరికా మిలటరీ... మౌలానా ఫజుల్లాను అంతమొందించినట్లు సమాచారం. అయితే దాడిలో మృతి చెందిన ఉగ్రవాది పేరును మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. యూఎస్ జరిపిన దాడిలో పాకిస్థాన్ తాలిబన్ అధిపతి మౌలానా ఫజ్లుల్లా, మరో నలుగురు తహ్రీక్ ఇ తాలిబన్ కమాండర్లు హతమైనట్లు ఆఫ్గాన్లోని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫజుల్లా మృతిని పాక్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఫజ్లుల్లా, అతడి కమాండర్లు ఇఫ్తార్ విందులో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
2013లో పాకిస్థాన్లోని తాలిబన్ చీఫ్గా ఫజ్లుల్లా నియమితులయ్యాడు. అప్పటినుంచి అమెరికా, పాకిస్థానీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డాడు. 2014 డిసెంబరులో పాకిస్థాన్లోని పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్పై జరిగిన ఉగ్రదాడిలో ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఆ ఘటనలో 151 మంది చిన్నారులు బలయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. ఫజుల్లాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై 5 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది.