పెషావర్: పాఠశాలకు తుపాకులు తెచ్చుకుంటున్న టీచర్లు
పెషావర్: విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు తమకు ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను కూడా ఎదుర్కొనేందుకు ఆ ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. పుస్తకాలు పట్టుకుని బడికి రావాల్సిన ఆ ఉపాధ్యాయులు తుపాకులు వెంట తెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్లోని పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 150మందికిపైగా ప్రాణాలను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు తుపాకులను వెంట తెచ్చుకుంటున్నారు.
తుపాకులను కాల్చడంలో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. పెషావర్ ఘటనతో ఉపాధ్యాయులు తీవ్ర ఉద్విగ్నానికి గురయ్యారు. కళ్లముందు పసిమొగ్గలు ఉన్మాదుల తూటాలకు నేలరాలుతుంటే.. ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నందుకు తమను తామే నిందించుకుంటున్నారు. ఇకపై అలాంటి అమానుషమేదైనా జరిగితే తక్షణమే స్పందించేందుకు.. విద్యార్థులను రక్షించుకోవాలని తుపాకీ చేపట్టడానికి సిద్ధమయ్యారు.
పెషావర్ ఫ్రాంటియర్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యాసంస్థకు చెందిన ఉపాధ్యాయురాలు షబ్నం తబిందా తోపాటు మరికొందరు టీచర్లు ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఆయుధ వినియోగంలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ చర్యను పాక్ ప్రభుత్వం స్వాగతించింది. ఆయుధాల కొనుగోలు అనుమతి ఇవ్వాలని, అవసరమైన లైసెన్స్లు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, దీనిని పాక్లోని కొందరు విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
పాఠశాలలపై దాడులను ఎదుర్కోవడానికి ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేస్తున్నారు. 37ఏళ్ల ఉపాధ్యాయిని షబ్నం మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పెషావర్ ఘటన తర్వాత నిరాయుధంగా పాఠశాలకు వెళ్లడం ఎంతమాత్రం సమంజసమని కాదని భావిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను రక్షించుకునేందుకు తాను తనతోపాటు పదిమంది టీచర్లు హ్యాండ్గన్ లైసెన్స్ తీసుకున్నారని ఆమె తెలిపారు.