గిల్గిట్ బాల్టిస్తాన్ హస్తగతానికి పాక్ మాస్టర్ ప్లాన్... అధికారిక విలీనం దిశగా కీలక నిర్ణయం...
ఓ పక్క సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతుండగానే... మరో పక్క పాకిస్తాన్ కూడా రెచ్చిపోతోంది. ఏకంగా గిల్గిట్-బాల్టిస్తాన్ను అధికారికంగా తమ దేశంలో విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి గిల్గిట్ ప్రజలు పాకిస్తాన్లో కలిసేందుకు విముఖత వ్యక్తపరుస్తున్నా... పాక్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. గిల్గిట్కు పూర్తి స్థాయి ప్రావిన్స్ హోదా ఇచ్చి సెనేట్, నేషనల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా భవిష్యత్తులో గిల్గిట్పై పూర్తి ఆధిపత్యం చలాయించే కుట్రకు తెరలేపింది.
మంత్రి అలీ అమీన్ ప్రకటన...
గిల్గిట్ బాల్టిస్తాన్కు రాజ్యాంగ బద్దమైన అన్ని హక్కులను కల్పించి దాన్ని పూర్తి స్థాయి ప్రావిన్స్గా మార్చేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు కశ్మీర్-గిల్గిట్ బాల్టిస్తాన్ వ్యవహారాల మంత్రి అలీ అమీన్ గందపూర్ బుధవారం(సెప్టెంబర్ 16) వెల్లడించారు. సెనేట్,నేషనల్ అసెంబ్లీలోనూ గిల్గిట్ ప్రావిన్స్కు ప్రాతినిధ్యం కల్పించాలని పాక్ నిర్ణయించిందన్నారు. త్వరలోనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్ బాల్టిస్తాన్ను సందర్శించి దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని స్పష్టం చేశారు. గిల్గిట్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అలీ అమీన్ పేర్కొనడం గమనార్హం.
అభివృద్ది హామీలతో...
గిల్గిట్ బాల్టిస్తాన్కు ప్రావిన్స్ హోదా కల్పించడం ద్వారా 73 ఏళ్ల దాని దారిద్య్రానికి ముగింపు పలికినట్లు అవుతుందన్నారు. ప్రావిన్స్ హోదాతో పాటు గిల్గిట్ అభివృద్దికి అవసరమైన అన్ని చర్యలను పాక్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. విద్య,వైద్య,ఆరోగ్య,పర్యాటక తదితర రంగాలన్నింటినీ ప్రభుత్వం అభివృద్ది చేస్తుందన్నారు. ఆయా రంగాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తుందన్నారు. అలాగే స్థానికులకు పక్కా ఇళ్ల కోసం రుణాలు కూడా ఇప్పిస్తామన్నారు. మెడికల్,ఇంజనీరింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తామని... ఇక్కడి వన్యప్రాణులను,అడవిని కాపాడేందుకు ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటిస్తామని చెప్పారు.
నవంబర్లో ఎన్నికలు...
భారత్-పాక్ మధ్య వివాదంలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ను హస్తగతం చేసుకునేందుకు పాక్ అక్కడ ఎన్నికలకు కూడా సిద్దమైంది. ఇందుకు అనుగుణంగా 2018లోనే పాకిస్తాన్ ఓ చట్టం తీసుకురాగా... దాని ఆధారంగా పాక్ సుప్రీం కోర్టు అక్కడ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై మంత్రి అమీన్ మాట్లాడుతూ... నవంబర్లో ఎలక్షన్ జరుగుతుందన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలోనే అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఖరారు చేస్తామన్నారు.
అది తమ భూభాగమంటున్న భారత్...
గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగంలో అంతర్భాగమని భారత్ తొలినుంచి వాదిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి లేదా న్యాయ వ్యవస్థతకు బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై ఎటువంటి హక్కు లేదని చెబుతోంది. గిల్గిట్-బాల్టిస్తాన్లో ఎన్నికల నిర్వహణకు పాక్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఇటీవల తీవ్రంగా ఖండించింది. పీఓకెలో మానవ హక్కుల ఉల్లంఘన,దోపిడీ,స్వేచ్చను నిరాకరించడం ప్రపంచమంతటికీ తెలిసిన నిజాలేనని పేర్కొంది.
అధికారిక విలీనం...?
1947 నుంచి పాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్తాన్పై అనధికారిక నియంత్రణ కొనసాగిస్తూనే ఉంది. అప్పట్లో ఈ ప్రాంతం కోసం భారత్-చైనా మధ్య యుద్దం కూడా జరిగిన 1949లో కాల్పుల విరమణ జరిగింది. అప్పటికే గిల్గిట్ బాల్టిస్తాన్ను ఆక్రమించుకున్న పాకిస్తాన్ దానిపై సర్వ హక్కులు తమవేనని ప్రకటించుకుంది. ఆ తర్వాత దానికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టి తమ ఆధీనంలోనే ఉంచుకుంది. ఇప్పుడు ప్రావిన్స్ హోదా ఇవ్వడం ద్వారా అధికారికంగా దాన్ని పాకిస్తాన్లో విలీనం చేసే చర్యకు పూనుకుంది.