పాకిస్తాన్ కూడా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిస్తుందట!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైతం అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటోంది. పొరుగుదేశం భారత్.. అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నే స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2022 నాటికి అంతరిక్షంలో వ్యోమగామిని పంపిస్తామని ఆ దేశ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌధురి తెలిపారు.
మాయమైన ఐ ఇన్నాళ్లకు తిరిగొచ్చింది: కుర్చీపై ఆశతో పేరు మార్చుకున్న మాజీ సీఎం!
దీనిపై గురువారం ఆయన రాజధాని ఇస్లామాబాద్లో ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ చంద్రయాన్-2 ప్రాజెక్ట్ను ప్రయోగించిన రెండురోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వ్యోమగాములను ఎంపిక చేసే ప్రక్రియను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆరంభిస్తామని ఫవాద్ చౌధురి తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ మొత్తం తమ దేశ వైమాని దళం పర్యవేక్షిస్తుందని అన్నారు. అంతరిక్షంలో వ్యోమగాములను పంపించ గల శక్తి సామర్థ్యంలో తమకు లేవని, చైనా సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు. చైనా ఉపగ్రహ ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరిస్తామని తెలిపారు. తొలిదశలో 50 మందిని ఎంపిక చేస్తామని, 2022 నాటికి 25 మందిని తుది జాబితాలో చేర్చుతామని అన్నారు. ఈ 25 మందిలో 10 మందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తరువాత ఒకరిని మాత్రమే అంతరిక్షంలోకి పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తాన్నీ వైమానిక దళానికి అప్పగిస్తామని అన్నారు.
పాకిస్తాన్ గత ఏడాది రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. దీనికోసం ఆ దేశం చైనా ఉపగ్రహ ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది. చైనీస్ లాంగ్ మార్చ్ (ఎల్ఎం-2సీ) రాకెట్ ద్వారా గోబి ఎడారిలోని గ్ఝియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి పాకిస్తాన్ వాటిని అంతరిక్షంలోకి ప్రయోగించింది. వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ కోసం కూడా ఆ దేశం సహకారాన్ని తీసుకోవడానికి సమాయాత్తమౌతోంది. ఇప్పటిదాకా పాకిస్తాన్ అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించలేదు. అంతరిక్ష ప్రయోగాల రంగంలో ఆ దేశం ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తోంది.