పాకిస్తాన్ వద్ద అత్యాధునిక, ప్రమాదకర ఆయుధం, భారత్ ఆందోళన!
కరాచీ: పాకిస్తాన్ అమ్ములపొదిలో కొత్తగా ఓ అస్త్రం వచ్చి చేరింది. ఇది భారత్కు ఆందోళన కలిగిస్తోంది. చైనా తయారు చేసిన పలు రకాలుగా వినియోగించగలిగే వింగ్ లూంగ్ డ్రోన్లు పాక్ వద్దకు చేరాయి.
ఇవి వాటంతట అవే వెళ్తూ శత్రు స్థావరాలపై బాంబు దాడులను చేసి వెనక్కి వచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది ఇప్పుడు భారత్ను కలవరపెడుతోంది. బేస్ నుంచి 280 కిలోమీటర్ల వేగంతో సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు.
రాడర్లకు చిక్కకుండా
రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులోనే వెళ్లే వీటిని కనుగొని ప్రది దాడి చేయాలన్నా కష్టమే. సుమారు 14 మీటర్ల పొడవు ఉండే ఈ డ్రోన్ విమానాలు ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవి గంటకు 280 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 5వేల కిలోమీటర్లకు పైగా ఏకధాటిగా ప్రయాణించగలవు.
ఇలా దాడులు చేయవచ్చు
100 కిలోలకు పైగా బరువైన బాంబులను ఇవి మోసుకు వెళ్లగలవు. తేలికపాటి మిసైల్ను కూడా వీటికి అనుసంధానం చేసి దాడులు చేయవచ్చు. చైనా వీటిని పాకిస్తాన్కు అందించినట్లుగా సమాచారం తమ వద్ద ఉందని భారత సైనికాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ తరహా డ్రోన్లు లేవు
ఈ తరహా డ్రోన్లు ఇంకా భారత్ సైన్యం వద్ద లేవని సదరు సైన్యాధికారి చెప్పారు. చైనా వింగ్ లూంగ్ సిరీస్లో ప్రస్తుతం నాలుగో తరం డ్రోన్లను తయారు చేస్తోంది. నవంబర్ 24, 2017న శాటిలైట్ పిక్చర్లో ఈ డ్రోన్ కనిపించింది.
ఇజ్రాయెల్, అమెరికా డ్రోన్ల కోసం
ఈ విషయం ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని, దీనిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని సైనికాధికారి అన్నారు. భారత్ నిఘా కోసం డ్రోన్లు వాడుతోంది. ఇజ్రాయెల్, అమెరికా నుంచి ఎదురుదాడి చేయగల, పెద్ద డ్రోన్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.