పాక్, జింబాబ్వే క్రికెట్ మ్యాచ్: స్టేడియం దగ్గర ఉగ్రవాద దాడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. అయితే పోలీసులు సరైన సమయంలో అడ్డుకున్నారు. అదే సమయంలో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.
శుక్రవారం లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో పాక్ - జింబాబ్వే జట్ల మద్య రెండో వన్ డే క్రికెట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం వద్దకు వెళ్లేందుకు ఒక ఉగ్రవాది ప్రయత్నించాడు. అదే సమయంలో పోలీసులు ఉగ్రవాదిని అడ్డుకున్నారు.
ఆ సమయంలో ఉగ్రవాది అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో ఉగ్రవాదితో పాటు ఒక ఎస్ఐ మరణించాడు. ఆరు మంది పోలీసులకు తీవ్రగాయాలైనాయి. పాకిస్థాన్ లో క్రికెట్ ఆడటానికి అన్ని దేశాలు ఇప్పటికే నిరాకరించిన విషయం తెలిసిందే.
అయితే గట్టి భద్రత కల్పిస్తామని హామి ఇవ్వడంతో జింబాబ్వే జట్టు పాక్ లో క్రికెట్ ఆడటానికి అంగీకరించి ఇక్కడికి వచ్చారు. స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు దాడులు చేశారని బయటకు తెలిస్తే పరువు పోతుందని పాక్ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రతలు తీసుకుంది.
అయితే పాక్ ప్రభుత్వం పరువు పోయిందని ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. పాక్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రసారం చెయ్యరాని బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కు సూచించడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. పాక్ ప్రభుత్వం ఇప్పుడు క్రికెట్ సభ్యులకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.