పాకిస్తాన్కు ఎఫ్ఏటీఎఫ్ షాక్... మళ్లీ గ్రే జాబితాలోనే... కొత్త డెడ్ లైన్ ఎప్పటివరకంటే...
ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడంలో విఫలమైన పాకిస్థాన్ను 'గ్రే' జాబితాలోనే కొనసాగించాలని అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల నిరోధక సంస్థ 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్-ఎఫ్ఏటీఎఫ్' నిర్ణయించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతున్న నిధుల తనిఖీ విషయంలో పాకిస్తాన్ వైపు తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొంది.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ 2018లో పాకిస్తాన్ను గ్రే జాబితాలో చేర్చింది. 2019 చివరి వరకూ ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని,మనీ లాండరింగ్ను నిలువరించాలని ఎఫ్ఏటీఎఫ్ డెడ్లైన్ విధించింది. కానీ పాకిస్తాన్ అందులో విఫలం కావడంతో గ్రే జాబితాలోనే కొనసాగుతూ వస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ఎన్నిసార్లు డెడ్ లైన్లు విధించినా పాక్ వైపు నుంచి పెద్దగా ఆశించిన చర్యలేవీ కనిపించలేదు.
చివరిసారిగా అక్టోబర్,2020లో సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్... పాకిస్తాన్ను ఫిబ్రవరి 2021 వరకూ గ్రే జాబితాలోనే కొనసాగించాలని నిర్ణయించింది. కానీ ఈ డెడ్ లైన్ కూడా ముగుస్తున్నప్పటికీ పాక్ ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి పాక్ను గ్రే జాబితాలో కొనసాగించాలని ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయించింది. మొత్తం 27 అంశాల విషయంలో జూన్,2021ని కొత్త డెడ్ లైన్గా నిర్ణయించింది. ఇప్పటికైతే 24 అంశాలను పాక్ పరిష్కరించగలిగిందని... మరో మూడు అంశాలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. కొత్త డెడ్ లైన్ పూర్తయ్యే లోగా మొత్తం టార్గెట్స్ను పూర్తి చేయాలని సూచించింది. అప్పటివరకూ పాకిస్తాన్ గ్రే లిస్టులోనే కొనసాగనుంది.
కాగా,ఎఫ్ఏటీఎఫ్ ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ. జీ7 దేశాల చొరవతో 1989లో ఇది ఏర్పాటైంది. ప్రస్తుతం ఇందులో 38 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మనీ ల్యాండరింగ్ను ఎదుర్కోవడానికి ఎఫ్ఏటీఎఫ్ యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తుంది. ఎఫ్ఏటీఎఫ్ సభ్య దేశాలు ఆ యాక్షన్ ప్లాన్ను అమలుచేయాలి. కానీ పాకిస్తాన్ అందులో విఫలమవుతుండటంతో గ్రే జాబితాలోనే కొనసాగుతోంది. దీని ద్వారా పాకిస్తాన్కు ప్రతి ఏటా సుమారు రూ.73వేల కోట్లు నష్టం వాటిల్లితున్నట్లు ఒక అంచనా.