లాడెన్ ఆచూకీ పాక్ వర్గాలే చెప్పాయా, రూ.160 కోట్లకు అమ్మేశారా?
వాషింగ్టన్: అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించేందుకు అమెరికాకు పాకిస్తాన్లోని కొన్ని వర్గాలు సహకరించాయా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికన్ వర్గాలు అతడి ఆచూకీని రహస్యంగా కనుగొని, నేవీ సీల్స్ బృందాలను పంపించి ఆ ఆపరేషన్ ద్వారా చంపేశాయని తెలుసు.
కానీ, కొంతమంది పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు కలిసి బిన్ లాడెన్ను దాదాపు ఐదేళ్ల పాటు అబోతాబాదులో దాచి, దాదాపు రూ.160 కోట్లకు అమెరికాకు అమ్మేసి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఈ సంచలన విషయాన్ని హెర్ష్ అనే పాత్రికేయుడు బయటపెట్టాడు.
లాడెన్ను మట్టుబెట్టడంలో అమెరికాకు పాకిస్తాన్ అధికారులు అందించిన సహకారంపై సరికొత్త విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం. లాడెన్ పైన అమెరికా ప్రకటించిన 25 మిలియన్ డాలర్ల నజరానా కోసం పాకిస్తాన్ గూఢచార విభాగానికి చెందిన మాజీ అధికారి ఒకరు లాడెన్ ఆచూకీ గురించి సీఐఏ (అమెరికా గూఢచార సంస్థ)కి తెలియజేసినట్లు తాజాగా వెలువడిన కథనం వెల్లడించింది.
2010 ఆగస్టులో పాకిస్తాన్ గూఢచార విభాగానికి చెందిన మాజీ సీనియర్ అధికారి ఒకరు ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయంలో అప్పటి సీఐఏ స్టేషన్ చీఫ్ జోనాథన్ బ్యాంక్ను సంప్రదించారని, అల్ఖైదా అధినేత తలపై అమెరికా ప్రకటించిన 25 మిలియన్ డాలర్ల నజరానాను తనకు ఇస్తే లాడెన్ ఎక్కడున్నదీ తెలియజేస్తానని ఆయన చెప్పారని సదరు అమెరికా జర్నలిస్టు హెర్ష్ను ఉటంకిస్తూ డాన్ పత్రిక వెల్లడించింది.
సిఐఎకి లాడెన్ సమాచారాన్ని అందించిన మాజీ గూఢచార అధికారి పాక్ సైనిక దళంలో పనిచేశాడని, ప్రస్తుతం అతను వాషింగ్టన్లో ఉంటున్నాడని హెర్ష్ తెలిపారు.