దైవదూషణ: ప్రతిగా చేతిని నరికిచ్చిన బాలుడు
లాహోర్: దైవదూషణకు పాల్పడ్డానని అనుకుని 15 ఏళ్ల బాలుడు తన చేతిని తానే నరుక్కున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్లోని లాహోర్కు 125 కిలోమీటర్ల దూరంలోని ముఖీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసు చీఫ్ నౌషర్ అహ్మద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామంలోని మసీదులో ప్రార్థన జరుగుతుండగా మధ్యలో ఎవరో ఆపమని అరచినట్లుగా వినిపించిందనీ, ఎవరు అరిచారో చెప్పాలంటూ ఇమామ్ అడిగారు. దీంతో ఈ 15 ఏళ్ల మహమ్మద్ అన్వర్ తన చేతిని పైకెత్తాడు. దీంతో మసీదులో ఉన్న ప్రజలు అన్వర్ దైవదూషనకు పాల్పడ్డావని కోపగించుకున్నారు.
దీంతో అన్వర్ వెంటనే ఇంటికి వెళ్లి తన చేతిని నరుక్కుని ప్లేట్లో పెట్టి ఇమామ్కు అప్పగించాడని పోలీసులు తెలిపారు. తాను దైవదూషణకు పాల్పడ్డాననీ, దానికి పశ్చాత్తాపంగానే ఈ పని చేశానని ఆ యువకుడు ఇమామ్తో చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటన గురించి ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. కాగా దైవదూషణ అనేది పాకిస్థాన్లో క్షమించరాని నేరంగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు.