రోగం నయం చేయమని వస్తే వ్యాధి అంటగట్టాడు : కలుషిత సిరంజితో ప్రాణం తీస్తున్నాడు
లార్కానా : అతనో డాక్టర్ .. ప్రాణం పోయాలి, రోగికి వైద్యం అందించి భరోసా కల్పించాలి. కానీ డాక్టర్ రూప సైకో .. తనకున్న జబ్బును పదిమందికి వ్యాపింపజేశాడు. ఆ కుటీల డాక్టర్కు ఉంది సాధారణ జలుబో, దగ్గో కాదు .. ప్రాణాంతకమైన ఎయిడ్స్. ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ను తన ఒంట్లో పెట్టుకొని .. అభం, శుభం తెలియని పిల్లలకు అంటగడ్డాడు. ఈ దురాగతం పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్లోగల లార్కానాలో జరిగింది.
బయటపడిందిలా ?
లార్కానా పట్టణ శివారులో 18 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ సోకినట్టు తేలింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అలర్టయ్యారు. మిగిలినవారరిని పరీక్షించగా మొత్తంగా 90 మందికి హెచ్ఐవీ సోకింది. వీరిలో 65 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల పేరెంట్స్కు కూడా హెచ్ఐవీ ఉందా అని పరీక్షించగా .. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
డాక్టర్ రూప రాక్షసుడు
ఆ పిల్లల తల్లిదండ్రులకు కాదు .. ఓ డాక్టర్ నిర్వాకం వల్ల హెచ్ఐవీ సోకిందని నిర్ధారించారు. డాక్టర్కు హెచ్ఐవీ ఉందని తెలిసింది. అతను వాడిన సిరంజిలను మళ్లీ, మళ్లీ వాడి పసిమొగ్గలను చిదిమేశాడు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు అదే సిరంజీతో ఇంజక్షన్ చేశాడు. వీరిలో కొందరు పెద్దవాళ్లు కూడా ఉండటం గమనార్హం.
అదుపులోకి వైద్యుడు
ఈ ఘటనను విచారించి డాక్టర్ను అదుపులోకి తీసుకున్నట్టు సింధు ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి అజ్ర పెచుహూ తెలిపారు. ఈ డాక్టర్ వల్ల ఇంకా ఎవరైనా హెచ్ఐవీ బారిన పడ్డారేమో తెలుసుకునేందుకు మరికొంతమందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
తక్కువే కానీ ..
వాస్తవానికి పాకిస్థాన్లో హెచ్ఐవీ కేసులు తక్కువగా నమోదవుతాయి. కానీ డాక్టర్ వల్ల 90 మందికి వ్యాధి సోకడం ఆందోళన కలిగిస్తోంది. అయితే డ్రగ్స్ వాడేవారు, సెక్స్ వర్కర్లు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి తిరిగొచ్చిన వారి ద్వారా హెచ్ఐవీ సోకుతుందని తెలుసుకున్నారు.