ఇంటర్నెట్లో వైరల్: యుద్ధం వద్దు, భారత్ ఒక్క అవకాశం ఇవ్వాలని పాక్ యువతి లేఖ
న్యూఢిల్లీ: యూరీ సెక్టార్లోని భారత సైనిక శిబిరంపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడి, ఆ ఘటన అనంతరం పీఓకేలోని పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడంతో సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొందరు యుద్ధం చేయాలని ఒత్తిడి తెస్తుంటే, మరికొందరు యుద్ధం వల్ల నష్టం జరుగుతుందని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎవరికి వారు తమ అభిప్రయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు చెందిన అలిజే జఫ్పర్ అనే యువతి ఒక లేఖ రాసింది.
ఆమె రాసిన లేఖలోని సారాంశం ఏమింటంటే..
రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలు బాధిస్తున్నాయని, ఇరు దేశాలు పరస్పర విమర్శలు చేసుకోవద్దని కోరింది. యుద్ధం వద్దని, శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని ఆమె తన లేఖలో సూచించింది. ఈ ఇరవై ఏళ్లలో ఇరు దేశాలు ఈ దాడుల వల్ల ఏం సాధించాయని ఆమె ప్రశ్నించింది.
పాఠ్య పుస్తకాల్లో ఉరీ ఘటన మరో పాఠ్యాంశంగా మిగిలిపోతుందే తప్ప, దాని వల్ల ఎవరు లాభపడ్డారని ప్రశ్నించింది. ఇరు దేశాల మధ్య ఉన్న 'కోల్డ్ వార్' ఇప్పుడు 'హాట్ వార్'గా మారిందని అలిజే జప్ఫర్ ఆవేదన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ తప్పిదాలను గుర్తించి, సర్ది చెప్పేందుకు భారతీయులు మరో అవకాశం ఇవ్వాలని ఆమె కోరింది.
ఇండో-పాక్ సరిహద్దుల్లో తన స్నేహితులు ఎందరో ఉన్నారని, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యం పాలైనప్పుడు ఆయన కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థించానని, అలాగే, రణ్ బీర్ సినిమా హిట్టయితే గర్వంగా ఫీలయ్యానని ఆమె చెప్పింది. ఇండియా నుంచి పాకిస్థాన్ విడిపోవడం ఇరు దేశాలకు బాధ కలిగించిందని ఆమె లేఖలో పేర్కొంది.
ఇరు దేశాలు సహనంతో, సంయమనంతో వ్యవహరించాలని తన లేఖలో పేర్కొంది. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ లేఖ పలువురిని ఆలోచింపజేస్తుంది. చాలామంది ఆమె వాదనతో ఏకీభవిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్ధతు పలుకుతున్నారు.